అమరావతి: పాస్టర్ ప్రవీణ్ రోడ్డు ప్రమాదం వల్లే చనిపోయారని ఏలూరు రేంజ్ ఐజి అశోక్కుమార్ తెలిపారు. ప్రవీణ్ పగడాల బుల్లెట్పై స్పీడ్గా రావడంతో అదుపుతప్పి రాళ్లపై స్కిడ్ అయ్యి పడిపోవడంతో మృతి చెందారని వెల్లడించారు. బుల్లెట్ నుంచి పడిపోవడంతో తలకు గాయాలు అయ్యాయని, రోడ్డు ప్రమాదం వల్లే గాయాలు అయినట్టు నిర్ధారించామన్నారు. ప్రవీణ్ రెండు చోట్ల ప్రమాదానికి గురయ్యారని, జగ్గయ్యపేట బైపాస్ దగ్గర మొదటి ప్రమాదం జరిగిందని, రామవరప్పాడు జంక్షన్ దగ్గర ప్రవీణ్కు మరో ప్రమాదం జరగిందని ఐజి వెల్లడించారు.
ప్రవీణ్ మద్యం సేవించి ఉన్నారని, పెట్రోల్బంక్ సిబ్బంది ద్వారా వివరాలు సేకరించామని, ఎఫ్ ఎస్ఎల్ రిపోర్టులో బాడీలో లిక్కర్ ఉందని తేలిందని, దారి పొడవునా సిసి కెమెరాలను పరిశీలించామని, ఆధునాతన టెక్నాలజీతో కేసు దర్యాప్తు చేశామని వివరించారు. 2 వారాల సుదీర్ఘ విచారణలో 113 మంది సాక్షులను విచారించామన్నారు. సోషల్ మీడియాలో కొందరు హత్య అని పోస్టులు పెట్టారని, సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న 11 మందిపై కేసులు నమోదు చేశామని ఐజి తెలిపారు.