Friday, October 18, 2024

సుప్రీంకు పతంజలి క్షమాపణ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి ఆయుర్వేద సంస్థ సుప్రీం కోర్టుకు క్షమాపణలు తెలియజేసింది. ధిక్కార పిటిషన్‌పై సమాధానం ఇవ్వకపోవడంతో రెండు రోజుల క్రితం అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన రామ్‌దేవ్ బాబా, మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు సమన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమం లోనే తాజా స్పందన వచ్చింది. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి ఆయుర్వేద సంస్థపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత ఏడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. తమ ఉత్పత్తులు వివిధ రకాల వ్యాధులను నయం చేస్తాయంటూ ‘అసత్య, తప్పుదోవ ’ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని సూచించింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇకపై ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. కానీ ఆ హామీని ఉల్లంఘించడంపై గత నెల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో తెలపాలంటూ రామ్‌దేవ్ బాబాకు, ఆచార్య బాలకృష్ణకు నోటీసులు జారీ చేసింది.

ప్రకటనల విషయం లోనూ సూచనలు చేసింది. ఇతర వైద్య విధానాలపై ప్రభావం చూపేలా ప్రింట్ లేదా ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ఎలాంటి ప్రచారం చేయొద్దని మరోసారి సూచించింది. ఆ నోటీసులకు పతంజలి సమాధానం ఇవ్వడంలో విఫలమైంది. ‘మీ ప్రతిస్పందన ఎందుకు దాఖలు చేయలేదు ?’ అని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. తదుపరి విచారణ సమయంలో వారిద్దరు కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పతంజలి సంస్థ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. న్యాయవ్యవస్థ పట్ల అత్యంత గౌరవం ఉందని బాలకృష్ణ పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆ తరహా ప్రకటనలు జారీ చేయకుండా చూసుకుంటామని చెప్పారు. ఈ ఉత్పత్తుల వాడకం ద్వారా ప్రజలు ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని గడపాలన్నదే తమ సంస్థ ఉద్దేశమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News