Sunday, October 6, 2024

ఓపిక నశించింది… ఇదే చివరి అవకాశం

- Advertisement -
- Advertisement -

నవంబర్ 19లోగా తగు చర్యలు తీసుకోవాలి
సుప్రీం కోర్టు ఆదేశం
వలస కార్మికులకు రేషన్ కార్డులపై రాష్ట్రాల తీరుకు ఆక్షేపణ

న్యూఢిల్లీ : వలస కార్మికులకు రేషన్ కార్డు పంపిణీలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు చేస్తున్న జాప్యంపై సుప్రీం కోర్టు శనివారం అసహనం వ్యక్తంచేసింది. తమకు ఇక ఓపిక నశించిందని కోర్టు తెలిపింది. రేషన్ కార్డుల కోసం ఇశ్రమ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల తీరు ఆందోళనకరమని సుప్రీం కోర్టు పేర్కొన్నది. ‘ఈ అంశంలో ఎటువంటి ఉదాశీనతకూ చోటు లేదని మరొకసారి స్పష్టం చేస్తున్నాం. ఇక మాకు ఓపిక నశించింది. మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నాం.

లేదంటే మీ కార్యదర్శులు కోర్టుకు రావలసి ఉంటుంది’ అని న్యాయమూర్తులు సుధాంశు ధులియా, అహ్సనుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం హెచ్చరించింది. ఈ వ్యవహారంపై నవంబర్ 19 లోగా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని బెంచ్ స్పష్టం చేసింది. అంత్యోదయ అన్న యోజన కింద ప్రాథమ్య కుటుంబానికి ఒక్క రేషన్ కార్డు మాత్రమే ఇస్తున్నట్లు కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి తెలియజేశారు.

కొవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని సర్వోన్నత న్యాయస్థానం 2020లో దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా ఇశ్రమ్ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న ఎనిమిది కోట్ల మంది వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని 2021లో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోర్టు ఆదేశించింది. అయితే, ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా, తక్కిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి. దీనితో సుప్రీం కోర్టు మరొక సారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News