లండన్: మెగాస్టార్ చిరంజీవిని హౌస్ ఆప్ కామన్స్ యుకె పార్లమెంట్లో ఘనంగా సత్కరించింది. సినీ, సేవా రంగాల్లో ఆయన చేసిన సేవలకు జీవిత సాఫల్య పురస్కారంతో గౌరవించింది. ఈ సందర్భంగా ఎపి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. చిరుకు సోదరుడిగా జన్మించినందుకు గర్వంగా ఉందని, ఈ పురస్కారం ఆయనకు మరింత కీర్తి తీసుకొచ్చిందని కొనియాడారు. పవన్ కల్యాణ్ తన ట్విట్టర్లో పోస్టు చేశారు.
‘సాధారణ మధ్యతరగతి ఎక్సైజ్ కానిస్టేబుల్ కొడుకుగా జీవితం మొదలుపెట్టి, స్వశక్తితో, కళామతల్లి దీవెనలతో, చిత్ర రంగంలో మెగాస్టార్ గా ఎదిగి, నాలుగున్నర దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరిస్తూ, తన నటనతో ఉత్తమ నటుడిగా 9 ఫిలింఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు అందుకుని, నటనకు పర్యాయపదంగా నిలిచిన వ్యక్తి. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు ఎప్పుడూ గర్విస్తూనే ఉంటాను. నేను చిరంజీవిని ఒక అన్నయ్య గా కంటే ఒక తండ్రి సమానుడిగా భావిస్తాను. నేను జీవితంలో ఏం చేయాలో తెలియక, అయోమయంలో ఉన్న పరిస్థితుల్లో నాకు మార్గం చూపించిన వ్యక్తి ఆయన. నా జీవితానికి హీరో అన్నయ్య చిరంజీవి. తన సేవా భావంతో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించడం ద్వారా ఆపదలో ఉన్నవారికి రక్తదానం, నేత్రదానం అందిస్తూ, నన్నే కాకుండా కోట్లాదిమంది అభిమానులను సమాజ సేవకులుగా మార్చిన స్ఫూర్తి ప్రదాత మా అన్నయ్య కొణిదల చిరంజీవి. తాను ఎదగడమే కాకుండా తన కుటుంబంతో పాటుగా, ఎంతోమంది ఎదుగుదలకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయ సహకారాలు అందిస్తూ, టాలెంట్ ఉన్న ఎవరైనా సరే ఏ రంగంలో అయినా సరే రాణించవచ్చు అనేందుకు ఉదాహరణగా నిలిచారు. ఆయన సమాజానికి అందించిన సేవలకు గాను ఇటీవలే భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ చేతుల మీదుగా అందుకున్నారు’ అని పవన్ ప్రశంసించారు.
పద్మవిభూషణ్ డా. మెగాస్టార్ చిరంజీవికి, ఈనెల 19న జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించిన వార్త తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని, భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని మా అందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ పురస్కార కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తున్న స్టాక్ పోర్ట్ ఎంపి నవేందు మిశ్రాకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.