Thursday, September 19, 2024

త్వరలో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు

- Advertisement -
- Advertisement -

త్వరలో పెట్రోలు, డీజిల్ ధరల తగ్గింపు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పడిపోయిన నేపథ్యంలో భారత్‌లో ఇంధన ధరలను తగ్గింపు అంశంపై ప్రభుత్వం సమీక్షిస్తోంది. గురువారం పెట్రోలియం మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్ జైన్ మాట్లాడుతూ, గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరల క్షీణత ఇలాగే కొనసాగినట్లయితే పెట్రోలు ధరల తగ్గింపు నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ అంశంపై దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఒఎంసిలు) తమ నిర్ణయం ప్రకటిస్తాయని అన్నారు. దేశంలోని మూడు ప్రభుత్వ చమురు కంపెనీలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఒసిఎల్), హిందుస్థాన్ పెట్రోలియం (హెచ్‌పిసిఎల్) భారత్ పెట్రోలియం (బిపిసిఎల్) డీజిల్, పెట్రోల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులను రిటైల్ చేస్తాయి. ఈ ప్రభుత్వ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర ప్రకారం, ప్రతి 15 రోజులకు ఒకసారి డీజిల్, పెట్రోల్ ధరలను సమీక్షిస్తాయి.

ప్రభుత్వం మరోసారి డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించవచ్చని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న తరుణంలో ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. పెట్రోల్ ధరలలో చివరి కోత 2024 మార్చి 14న జరిగింది. అప్పట్లో డీజిల్, పెట్రోల్ ధరలు లీటరుకు రూ.2-2 తగ్గాయి. అంటే డీజిల్, పెట్రోల్ ధరలను చివరిసారి తగ్గించి 6 నెలలు కావస్తోంది, అప్పటి నుంచి ఈ రేట్లలో ఎలాంటి మార్పు లేదు. విదేశీ మార్కెట్‌లో ముడి చమురు ప్రస్తుతం మూడేళ్ల కనిష్ట స్థాయికి చేరుకుంది. గురువారం బ్రెంట్ క్రూడ్ 1.36 శాతం పెరిగి బ్యారెల్ రేటు 71.57 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ బ్యారెల్‌కు 1.43 శాతం లాభంతో 68.27 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ వారం ప్రారంభంలో మంగళవారం నాడు బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్ 70 డాలర్ల దిగువకు పడిపోయింది. డిసెంబర్ 2021 తర్వాత క్రూడ్ ఆయిల్ ధర 70 డాలర్ల దిగువకు పడిపోవడం ఇదే తొలిసారి. డిమాండ్ తగ్గడం వల్ల గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గుతున్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News