Sunday, October 6, 2024

మౌలిక సదుపాయాలతో ఫార్మా రంగం మరింత వృద్ధి

- Advertisement -
- Advertisement -

రాబోయే బల్క్ డ్రగ్ పార్కులో సౌకర్యాల కల్పనకు కేంద్రం సహకారం
ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ 73వ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన వల్ల ఫార్మ వంటి రంగాల్లో మరింత వృద్ధి సాధ్యమవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి కేంద్రం 15 వేల కోట్లను కేటాయించిందని గుర్తు చేశారు. రాబోయే బల్క్ డ్రగ్ పార్కులో కామన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్‌ని పెంచడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. భారతీయ ఫార్మ రంగం అంతర్జాతీయ ప్రమాణాలను అందుకునేలా ఫార్మస్యూటికల్ టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ అసిస్టెన్స్ స్కీం దోహదపడుతుందని ఆయన సూచించారు. హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఆదివారం జరిగిన ఇండియన్ ఫార్మాస్యూటికల్ కాంగ్రెస్ 73వ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఫార్మా పరిశ్రమకు చెందిన రీసెర్చ్ అండ్ డెవెలప్ మెంట్, క్వాలిటీ కంట్రోల్, అస్యూరెన్స్, మార్కెటింగ్ రెగ్యులేటరీ వంటి వివిధ విభాగాలకు ప్రాతింధ్యం వహించే 50 వేల మంది ఫార్మసీ ప్రొఫెషనల్ పాల్గొన్న ఈ సమావేశంలో తాను మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. హైదరాబాద్ ను ఫార్మసీ హబ్ గా మార్చిన ఫార్మా ఇండస్ట్రీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మనదేశ ఎగుమతుల్లో ఫార్మా ఉత్పత్తులే ఐదో అతి పెద్ద కమాడిటీగా ఆయన స్పష్టం చేశారు. ఎగుమతుల్లో ఐదు శాతం కన్న ఎక్కువ వాటా ఈ ఫార్మా రంగానిదేనని తెలిపారు. భారతీయ ఫార్మస్యూటికల్ ఉత్పత్తులు నాణ్యతలో, అన్ని విధాల చాలా బెస్ట్ అని ఇప్పటికే రుజువవుతున్నదని అన్నారు. కరోన కష్టకాలంలో భారత దేశం యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ తయారు చేసి యావత్ ప్రపంచానికి అందజేసిందని గుర్తు చేశారు. భారత దేశం దాదాపు 75 మిలియ డోసుల వ్యాక్సిన్ ను 94 దేశాలకు, ఐక్య రాజ్య సమితికి చెందిన రెండు ఎంటిటీలకు అందజేయడంతో భారత్ విశ్వబంధుగా ప్రపంచంలో కీర్తి పొందిందని కొనియాడారు.

అందుకే ఈ 73 వ సమావేశంలో ప్రపంచంలో భారతీయ ఫార్మా రంగం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుందని, వికసిత్ భారత్ లక్ష్య సాధన కోసం ఫార్మా పరిశ్రమ మద్దతు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం మనది ప్రపంచంలో అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కాగా త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఎదగాలనేది లక్ష్యమని అన్నారు. 2027 నాటికి భారత్‌ను ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకల్పంతో అద్భుతమైన మౌలిక సదుపాయాల కల్పనకోసం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం దేశంలో 74 ఆపరేషనల్ విమానాశ్రయాలు ఉండగా, రవాణా, హైవే బడ్జెట్ కేటాయింపులు చూస్తే 2014 తర్వాత 500 శాతం పెరిగాయని అన్నారు. మన నేషనల్ హైవే నెట్ వర్క్ 2014 లో 91.287 కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు లక్షన్న కిలోమీటర్లకు అంటే 60 శాతం పెరిగిందని అన్నారు. రైల్వే శాఖ దాదాపు 3 వేల కిలొమీటర్ల డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ నిర్మాణం తలపెట్టింది.

దేశం విద్యుత్ డిమాండ్ 2013-.14 లో 136 గిగా వాట్స్ ఉండేదని, 2023 నాటికి 244 గిగా వాట్స్ అంటే 508 శాతం పెరిగిందని అన్నారు. భారత ఫార్మా పరిశ్రమ శక్తిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దానికి అవసరమైన సహాకారాన్ని అందిస్తుందని తెలిపారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 12 కోట్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల వరకు వైద్య బీమా కల్పిస్తున్నామని గుర్తు చేశారు. ప్రధాన మంత్రి జన ఔషధి కేంద్రాల వల్ల ప్రజలకు 50 నుంచి 90 శాతం తక్కువ ధరకు మందులు అందిస్తున్నామని కేంద్రమంత్రి వివరించారు. ఫార్మా రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, దానికీ తమ ప్రభుత్వ సహకారం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ఫార్మా పారిశ్రామిక వర్గాలు హైదరాబాద్‌లో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఖచ్చితంగా ఈ విషయాన్ని ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లి తన వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News