Tuesday, September 17, 2024

తెలుగు నిజంగా అద్భుతమైన భాష:ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఆకాశవాణిలో ‘మన్ కీ బాత్’లో ప్రసంగించారు. ఈ నెల 29న తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటారని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అని ప్రధాని మోడీ తెలియజేశారు. ఇక అంతరిక్ష రంగంలో భారత్ దూసుకుపోతోందని ప్రధాని తెలిపారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా భారత్ చరిత్ర సృష్టించిందని మోడీ వెల్లడించారు. చంద్రయాన్3 విజయానికి గుర్తుగా అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ ఏడాది తొలిసారి అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటున్నామని మోడీ చెప్పారు. గతంలో లేని విధంగా ఇప్పుడు స్పేస్ సైన్స్ పట్ల యువత ఆకర్షితం అవుతోందని ప్రధాని తెలియజేశారు. అంతరిక్ష రంగంలో వివిధ సంస్కరణల నుంచి దేశ యువత ఎంతగానో లబ్ధి పొందిందని ప్రధాని తెలిపారు. మోడీ ఈ కార్యక్రమంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో కూడా మాట్లాడారు. వారు ఐఐటి మద్రాసు పూర్వ విద్యార్థుల.

స్పేస్ స్టార్టప్ ‘గ్యాలక్స్ ఐ’ని వారు నిర్వహిస్తున్నారు. వారు మోడీకి తమ కృషిని వివరించారు. దేశంలో వృద్ధి చెందుతున్న చైతన్యవంతమైన స్పేస్ ఎకో సిస్టమ్‌ను కొనియాడారు. రాజకీయాల్లోకి రావాలని లక్ష మంది యువజనులకు తాను స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పిలుపు ఇచ్చానని, ఆ పిలుపునకు యువత నుంచి విశేషంగా స్పందన వచ్చిందని, యువత క్రియాశీల రాజకీయాల వైపు మొగ్గు చూపుతోందని ప్రధాని వెల్లడించారు. వారికి సరైన అవకాశం, మార్గదర్శనం ఇవ్వవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. రాజకీయ నేపథ్యం ఏమీ లేకుండా యువజనులు రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్యాన్ని దృఢతరం చేస్తుందని మోడీ చెప్పారు. తన పిలుపుపై యువజనులు తనకు లేఖ రాయడమే కాకుండా, సామాజిక మాధ్యమంలో కూడా స్పందించారని ఆయన తెలిపారు. వారు అనేక రకాల సూచనలు చేశారని మోడీ చెప్పారు. కుటుంబ రాజకీయాలు కొత్త ప్రతిభను అణచివేస్తాయని వారు అభిప్రాయం వెలిబుచ్చారని ఆయన చెప్పారు.

అట్టడుగు స్థాయిలో పని చేసిన మంచి అనుభవం తమకు ఉందని, కనుక ప్రజల సమస్యల పరిష్కారానికి తాము చేయూత ఇవ్వగలమని కొంత మంది యువజనులు తనకు రాశారని ప్రధాని వెల్లడించారు. వారి అనుభవం, అభిలాష దేశానికి ఉపయుక్తం కాగలవని ఆయన అన్నారు. ఈ సంవత్సరం హర్ ఘర్ తిరంగా ప్రచారం పెద్ద ఎత్తున చేపట్టామని, ఆ పిలుపును పురస్కరించుకుని ఇళ్లు, దుకాణాలు, కార్యాలయాల వద్ద జెండాలు ఆవిష్కరించారని ఆయన తెలియజేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనపై 750 మీటర్ల నిడివి గల పతాకంతో ఒక తిరంగా ర్యాలీని కూడా నిర్వహించారని మోడీ ఈ సందర్భంగా తెలియజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం అనేది ఒక సామాజిక ఉత్సవంగా మారిందని మోడీ తెలిపారు. నాడు పోరాటంలో అన్ని వర్గాలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయని, రాజకీయ నేపథ్యం లేకపోయినా స్వాతంత్య్రం కోసం పోరాడారని ఆయన చెప్పారు. ఇప్పుడు వికసిత్ భారత్ సాకారానికి కూడా స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి చాటాలని మోడీ పిలుపు ఇచ్చారు.

వికసిత భారత్ ప్రచారోద్యమంలో చేరవలసిందిగా మోడీ యువతకు విజ్ఞప్తి చేశారు. ‘ఈ మీ అడుగు మీ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దగలదు’ అని ఆయన అన్నారు. 21వ శతాబ్దంలో భారత్‌లో అనేక విషయాలు సంభవిస్తున్నాయని, అవి వికసిత భారత్‌కు వేదికను పటిష్ఠం చేస్తాయని ప్రధాని అన్నారు. పర్యావరణం మెరుగుదలలో వివిధ సంస్థలు, ప్రజల కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రస్తావించిన ప్రధాని మోడీ ఆ రంగంలో సంఘటిత కృషి అవసరమని ఉద్ఘాటించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News