జమ్ముకశ్మీర్లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని ప్రధాని మోడీ ఖండించారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. ఈ దాడి నేపథ్యంలో
జమ్ముకశ్మీర్లోని ఘటనాస్థలానికి వెళ్లాలని.. తగిన చర్యలు తీసుకోవాలని అమిత్ షాకు మోడీ కీలక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఉగ్రదాడిపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా స్పందించారు. పర్యటకులపై దాడి హేయమైన చర్య అని మండిపడ్డారు. దాడికి పాల్పడినవారు మానవ మృగాలని, ఘటనను ఖండించేందుకు మాటలు రావడం లేదని ఎక్స్ వేదికగా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో పర్యటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 10మంది పర్యాటకులు గాయపడ్డారు. వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సహాయక చర్యలు చేపట్టి.. గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఉగ్రవాదుల కోసం ఘటన జరిగి ప్రాంతాన్ని ఆధీనంలోకి తీసుకుని గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.