Monday, April 28, 2025

కస్తూరిరంగన్‌కు ప్రధాని మోడీ నివాళి

- Advertisement -
- Advertisement -

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మాజీ చైర్మన్, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కృష్ణస్వామి కస్తూరిరంగన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ప్రగాఢ విచారం వ్యక్తం చేశారు. ఆయనకు మోడీ నివాళులు అర్పించారు. ఆదివారం ప్రధాని మోడీ తన నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో మాట్లాడుతూ, దేశం ఒక గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. శాస్త్ర, విద్యా రంగాలకు, ముఖ్యంగా భారత అంతరిక్ష కార్యక్రమాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో కస్తూరిరంగన్ చేసిన విశేష కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని ప్రధాని చెప్పారు. ఆయన నాయకత్వంలో ఇస్రోకు నూతన గుర్తింపు లభించిందని, ఆయన మార్గదర్శకత్వంలో పురోగమించిన అంతరిక్ష కార్యక్రమం దేశానికి ప్రపంచవ్యాప్త గుర్తింపును తెచ్చిపెట్టిందని మోడీ కొనియాడారు, ప్రస్తుతం భారత్ వినియోగిస్తున్న అనేక ఉపగ్రహాలు కస్తూరిరంగన్ పర్యవేక్షణలోనే ప్రయోగించిన విషయాన్ని మోడీ గుర్తు చేసుకున్నారు.

నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి) రూపకల్పనలో డాక్టర్ కస్తూరిరంగన్ కీలక పాత్ర పోషించారని ప్రధాని తెలియజేశారు. 21వ శతాబ్దానికి అనుగుణంగా భవిష్యత్ దృక్పథంతో కూడిన విద్యా వ్యవస్థ ఆవిష్కరణకు ఆయన ఎంతో దోహదం చేశారని మోడీ చెప్పారు. నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన, ఆవిష్కరణలకు ఆయన ఇచ్చిన ప్రాధాన్యం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని మోడీ అన్నారు. దేశ నిర్మాణం కోసం కస్తూరిరంగన్ అందించిన నిస్వార్థ సేవలు చిరస్మరణీయమని అంటూ ప్రధాని ఆయనకు వినమ్ర నివాళులు అర్పించారు. అంతకు ముందు శుక్రవారం కూడా ప్రధాని మోడీ ‘ఎక్స్’ వేదికగా కస్తూరిరంగన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, దేశ శాస్త్ర, విద్యా రంగ ప్రస్థానంలో ఆయన ఒక శిఖర సమానులు అని అభివర్ణించిన విషయం విదితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News