Tuesday, September 17, 2024

బ్రిక్స్ ప్లస్ సదస్సుకు ప్రధాని మోడీ గైర్హాజరు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మంగళవారం జరగనున్న బ్రిక్స్ ప్లస్ వర్చవల్ సదస్సుకు ప్రధాని నరేంద్రమోడీ గైర్హాజరవుతున్నారు. ఈ సదస్సులో ఇజ్రాయెల్‌-హమాస్ యుద్ధంపై చర్చించనున్నారు. ప్రధాని తరఫున విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, ఇతర పనులు ఉండటంతో ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోడీ నిరాకరించారు.

ఈ కార్యక్రమంలో రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాధినేతలు పాల్గొంటున్నారు. మరోవైపు భారత్ మొదటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. బ్రిక్స్ ప్లస్ గ్రూపు లోని దేశాలతో పోలిస్తే భారత్ ఈ వివాదంపై భిన్నంగా స్పందిస్తోంది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ బాంబింగ్‌ను ఆపాలని భారత్ కోరలేదు. ఇక హమాస్ చర్యలను ప్రస్తావించలేదని ఐరాసలో ఓ తీర్మానంలో ఓటింగ్‌కు గైర్హాజరైంది. ఇక బ్రిక్స్ లోని రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు బహిరంగం గానే ఇజ్రాయెల్‌ను తప్పు పట్టాయి.

మరోవైపు ఇజ్రాయెల్ బాంబింగ్‌ను ఆపాలని ఐరాస భద్రతా మండలిలో తీర్మానం చేయాలనే డిమాండ్లు వస్తున్న సమయంలో బ్రిక్స్ మీటింగ్ జరగనుండటం గమనార్హం. పీ5 దేశాలను ఈ తీర్మానం కోసం ఒత్తిడి చేసేందుకు ఈ సమావేశం జరగనుంది. ఇక గాజాలో మానవతా సాయం నిమిత్తం యుద్ధంలో స్వల్ప విరామాల కోసం అంతర్జాతీయ సమాజం చేస్తోన్న ప్రయత్నాలను ఐరాసలో భారత్ మంగళవారం స్వాగతించింది. అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి, శాంతియుత పరిస్థితులు నెలకొనే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చింది. అలాగే బందీలను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News