Tuesday, September 17, 2024

మోడీ ఏకగ్రీవం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బిజెపి సారధ్యపు ఎన్‌డిఎ బుధవారం జరిపిన సమావేశంలో కూటమి నాయకుడిగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీనితో తిరిగి ఆయన ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమం అయింది. తమ కూట మి నేతగా మోడీపై అచంచల విశ్వాసాన్ని ప్రకటిస్తున్నట్లు ఈ నేపథ్యంలో ఓ ఏకగ్రీవ తీర్మానం వెలువరించారు. తమ రాబోయే ప్రభుత్వం పేదలు, మహిళలు, యువజనులు, రైతులు, సమాజంలోని అణగారిన వర్గాల అ భ్యున్నతికి కట్టుబడి ఉంటుంది. ఈ దిశలోనే పనిచేస్తుందని ఈ తీర్మానం లో పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎకు ఇతర పక్షాలతో పో లి స్తే ఎక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో , ఫలితాల మరుసటి రోజు ఇక్కడి మోడీ నివాసంలో ఎన్‌డిఎ కీలక సమావేశం జరిగింది. బిజెపికి ఈసారి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే సరైన బలం లేకపోవడంతో మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వ స్థాపనకు రంగం సిద్ధం అయింది. బుధవా రం జరిగిన ఎన్‌డిఎ భేటీకి తెలుగుదేశం పార్టీ నేత ఎన్ చంద్రబాబు నా యుడు, బీహార్ సిఎం, జెడియూ నేత నితీష్ కుమార్, మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే, ఎల్‌జెపి (ఆర్) నేత చిరాగ్

పాశ్వాన్, ఎన్‌సిపి చీలిక వర్గం తరఫున ప్రఫుల్ పటేల్ , కుమారస్వామి ఇతరులు హాజరయ్యారు. సమావేశంలో బిజెపి నేతలు అమిత్ షా, నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ కూడా పాల్గొన్నారు. అంతకు ముందు మోడీ రాష్ట్రపతిని కలిసి తమ ప్రభుత్వ రాజీనామా పత్రాన్ని అందచేశారు. దీనిని రాష్ట్రపతి ఆమోదించడం, ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని కోరడంతో ఆ తరువాత రంగం ఎన్‌డిఎ సమావేశం దిశగా మారింది. 1962 తరువాత వరుసగా మూడోసారి ప్రధాని కానున్న వ్యక్తి మోడీనే. ఇంతకు ముందు ఈ ఘనత వహించిన వ్యక్తి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే. ఇప్పుడు మరోమారు ఎన్‌డిఎ ప్రభుత్వంపై గురుతర బాధ్యత ఉందని, దేశ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందింపచేయడం, సంస్కృతిక వైభవ వారసత్వాన్ని నిలబెడుతూనే దేశ సర్వతోముఖాభివృద్ధి పయనాన్ని కొనసాగించేందుకు చర్యలు తీసుకోవడం కీలకమని , వీటికి కట్టుబడి ఉంటామని తీర్మానంలో తెలిపారు.

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ఎన్‌డిఎ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయన పట్ల అపార విశ్వాసంతో సంఘటితంగా సాగిందని , ఇందులో గెలిచిందని, ఇది అందరికి గర్వకారణం అని తీర్మానంలో పేర్కొన్నారు. మోడీ నాయకత్వ దక్షతను కొనియాడారు. తామంతా కలిసి తిరిగి మోడీని తమ పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నామని తెలిపారు. గత పది సంవత్సరాల ఎన్‌డిఎ హయాంలో దేశం ప్రతి రంగంలో ప్రగతి సాధించిందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారని పేర్కొన్నారు. మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ సర్కారు అనుసరించిన ఆచరించిన ప్రజా అనుకూల విధానాలు సత్ఫలితాలను ఇచ్చాయని తీర్మానంలో వెల్లడించారు. మోడీ తలపెట్టిన వికసిత్ భారత్ మహాలక్షం సాధనలో తామూ భాగస్వాములమయ్యామని ఈ తీర్మానంలో ఎన్‌డిఎలో ఉన్న బిజెపియేతర పార్టీలు తెలిపాయి. తీర్మానానికి ముందు జరిగిన చర్చల దశలో ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ , ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఎన్‌డిఎ ప్రభుత్వ స్థాపనకు తమను ఆహ్వానించాలని కోరుతూ ఒకటి రెండు రోజుల్లో ఎన్‌డిఎకు చెందిన ముగ్గురు ప్రముఖ నేతల బృందం రాష్ట్రపతిని కలుస్తుంది. ఈ బృందంలో చంద్రబాబునాయుడు, నితీష్‌కుమార్ కూడా ఉంటారు.

చంద్రబాబు, నితీష్ నుంచి లిఖితపూర్వక మద్దతు లేఖలు
ఈ నెల 9వ తేదీ ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం ?
ఈసారి ఎన్నికలలో 293 లోక్‌సభ స్థానాల సంఖ్యాబలాన్ని పొందిన ఎన్‌డిఎ ప్రభుత్వ స్థాపనకు అవసరం అయిన 272 బలనిర్థారణ సంబంధిత మెజార్టీ మార్క్‌ను దాటింది. ఈ క్రమంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం మోడీ నాయకత్వంలో శనివారం ప్రమాణం చేస్తుందని పలువర్గాల ద్వారా స్పష్టం అయింది. తమ పార్టీల నుంచి మోడీ ప్రభుత్వానికి పూర్తి సహకారం మద్దతు ఉంటుందని తెలిపే లేఖలను టిడిపి నేత చంద్రబాబు నాయుడు, జెడియూ నేత నితీష్‌కుమార్ అధికారికంగా అందించినట్లు వెల్లడైంది.

సమయం లేదు తొందరపడండి మిత్రమా
ప్రభుత్వ ఏర్పాటుపై మోడీకి నితీష్ హెచ్చరిక
బుధవారం జరిగిన ఎన్‌డిఎ సమావేశం దశలో మోడీని జెడియూ నేత నితీష్ కుమార్ త్వరితగతిన ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పారు. జల్దీకిజియో అన్నారు. యాక్ట్ ఫాస్ట్ అని మందలించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు కూడా సూచించారని వెల్లడైంది. మెజార్టీ సంతరించుకున్నామని ఇక ప్రభుత్వ కూర్పు విషయంలో వెంటనే చర్యలు చేపట్టాల్సిందే అని పేర్కొన్నారు.
అతి పెద్ద పార్టీగా బిజెపి
ఈసారి ఎన్నికలలో బిజెపి 240 సీట్లతో ఏకైక అతిపెద్ద పార్టీ అయింది. తరువాతి స్థానంలో కాంగ్రెస్ 99 సీట్లు తెచ్చుకుంది. ఎన్‌డిఎకు 293 స్థానాలు రాగా ఇండియా కూటమికి 233 వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరం అయిన మ్యాజిక్ ఫిగర్ 272. దీనిని ఎన్‌డిఎ దాటేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌డిఎకు అన్ని దారులు సుగమం అయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News