న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిపై మరోసారి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. మన్ కీ బాత్ 121వ ఎపిసోడ్లో ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ.. దేశాన్ని, ప్రపంచాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక.. దాన్ని నాశనం చేయడానికి శత్రువులు ప్రయత్నించారని చెప్పారు. ఉగ్రదాడిపై అంతా అగ్రహంతో రగిలిపోతున్నారని అన్నారు. ప్రతీ భారతీయుడి రక్తం మరిగిపోతుందని.. ఉగ్రవాదులకు ధీటైన సమాధానం ఇస్తామని హెచ్చరించారు.
ఉగ్రవాదంపై పోరాటంలో అన్ని పౌరుల ఐక్యత అత్యంత ముఖ్యమైందని..కష్టకాలంలో దేశం మొత్తం ఏకతాటిపై నిలిచిందన్నారు. ఈ పోరాటంలో భారత లోని 1.4 బిలియన్ల ప్రజలకు ప్రపంచం అండగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాశ్మీర్లో శాంతి తిరిగి వస్తోందని, పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని, అభివృద్ధి పనుల్లో పురోగతి ఉందని మోడీ అన్నారు. కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు.