న్యూఢిల్లీ : ఇండియాస్ గాట్ లాటెంట్ (ఐజీఎల్ ) కార్యక్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడతారా ? ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘ఇదంతా అసభ్యత కాకపోతే ఇంకేంటి ? మీ మెదుడు లోని చెత్తనంతా ఆ ప్రోగ్రామ్ ద్వారా బయటపెట్టారు. ఇలాంటి ప్రవర్తన ఖండించదగినది. మీరు పాపులర్ అని చెప్పి ఏదైనా మాట్లాడతా అంటే సమాజం ఆమోదించదు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా ? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి ” అని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. రణ్వీర్ను తీవ్రంగా మందలించిన కోర్టు ఆ తర్వాత ఊరట కల్పించింది. ఇక ఈ వ్యవహారంలో మరో పోలీస్ కేసు నమోదు చేయొద్దని ఆదేశాలు ఇచ్చింది.
కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచివెళ్లే ప్రయత్నాలు చేయొద్దని రణవీర్ను హెచ్చరించింది. అలాగే యూట్యూబర్ తన పాస్పోర్టును మహారాష్ట్ర లోని ఠాణె పోలీసులకు అప్పగించాలని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎలాంటి షోలు చేయకూడదని తేల్చి చెప్పింది. ఐజీఎల్లో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల గురించి శృంగారం పైన ప్రశ్నించడంతో ప్రముఖ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంట్ సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు సమయ్ రైనా షోలో రణ్వీర్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో అతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వాటిపై ఇటీవల యూట్యూబర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్లు అన్నిటినీ క్లబ్ చేయాలని ఓ పిటిషన్లో పేర్కొన్నాడు. దానిపై నే తాజాగా విచారణ జరిగింది.