భారత పురావస్తు సర్వే సంస్థ (ఎఎస్ఐ) కొన్ని పోర్చుగీస్ శకం ఫిరంగి గుండ్లను కనుగొన్న తరువాత పాత గోవా వారసత్వ సంపద స్థలంలో ప్రతిపాదిత పర్యాటక వసతుల కేంద్రంపై పనిని తాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు గోవా ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఎఎస్ఐ నుంచి అనుమతి వచ్చేంత వరకు, చర్చి అధికారులు తిరిగి ఆమోదించేంత వరకు ఆ పని కొనసాగదని గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంతె అసెంబ్లీలో చెప్పారు. ‘యునెస్కో రక్షిత వారసత్వ సంపద స్థలం పాత గోవాలో ఒక మాల్ నిర్మిస్తున్నార’ని పేర్కొంటూ కొందరు పౌరులు ఆ ప్రాజెక్టుపై నిరసన వ్యక్తం చేసిన రెండు రోజుల తరువాత ప్రభుత్వం నుంచి ఈ ప్రకటన వచ్చింది.
గోవాలో పర్యాటక కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వ ‘ప్రషాద్’ (పిల్గ్రిమేజ్ రీజువనేషన్ అండ్ స్పిరిట్యువల్ ఆగ్మెంటేషన్ డ్రైవ్) పథకం కింద ఒక చర్చి సమీపంలో పర్యాటక వసతుల కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. బిజెపి ఎంఎల్ఎ రాజేశ్ ఫల్ దేశాయి, సెయింట్ ఆండ్రి ఎంఎల్ఎ వీరేష్ బోర్కర్ ఒక సావధాన తీర్మానం ద్వారా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘యునెస్కో రక్షిత వారసత్వ సంపద ప్రదేశమైన పాత గోవాలో ఒక మాల్ను నిర్మిస్తున్నారు’ అని పేర్కొంటూ కొందరు పౌరులు ఆదివారం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన నిర్వహించిన తరువాత శాసనసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ప్రతిపాదిత స్థలాన్ని శుభ్రం చేస్తున్నప్పుడు ఫిరంగి గుండ్ల రూపంలో సాంస్కృతిక నిక్షేపాలు ఎఎస్ఐ దృష్టికి వచ్చిన తరువాత ప్రాజెక్టు పనిని ప్రస్తుతం నిలిపివేశాం’ అని ఖౌంతె తెలియజేశారు.