సినీ పరిశ్రమలో విభేదాలు, వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైల్లో ఉన్నారు. జైల్లో ఆయనకు ప్రత్యేక గదిని కేటాయించారు. మరోవైపు జైలులో ఉన్న పోసాని శనివారం అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో ఆయనను జైలు సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు.
పోసానికి అన్ని వైద్య పరీక్షలు చేయించాం…ఆయన డ్రామా ఆడారు : రైల్వేకోడూరు రూరల్ సీఐ
ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్ని వైద్య పరీక్షలు చేయించామని, ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైలులో ఉన్న పోసాని స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో ఆయనను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోసాని ఆరోగ్యంపై సీఐ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ కడుపు నొప్పి అని పోసాని కృష్ణమురళి డ్రామా ఆడారని తెలిపారు. పోసానికి అన్ని పరీక్షలు చేయిస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, కడప రిమ్స్ వైద్యులు ధృవీకరించారని తెలిపారు. పోసాని కృష్ణమురళిని మొన్న రాత్రి అరెస్ట్ చేసి,
రాజంపేట సబ్ జైలుకు తరలించామని వెల్లడించారు. ఉదయం తనకు అస్వస్థతగా ఉందని, కడుపులో నొప్పిగా ఉందని పోసాని చెప్పాడని తెలిపారు. దీంతో రాజంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్చామని వెల్లడించారు. ఆ తర్వాత అక్కడి నుండి కడప రిమ్స్కు తరలించామన్నారు. పోసానికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారని, ఈసీజీ సహా ఛాతీకి సంబంధించిన పరీక్షలు కూడా నిర్వహించారని ఈ వైద్య పరీక్షల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని వెల్లడైందని తెలిపారు. అతను నాటకమాడాడని తమకు అర్థమైందని తెలిపారు. పోసానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని, పూర్తిగా ఫిట్గా ఉన్నాడని వెల్లడించారు.