ప్రజలకు మాయావతి పిలుపు
లక్నో: ఉత్తర్ ప్రదేశ్లో బహుజన్ సమాజ్ పార్టీ(బిఎస్పి)ని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి దళితులు, బ్రాహ్మణులు ఐక్యం కావాలని బిఎస్పి అధినేత్రి మాయావతి పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్రవర్ణ బ్రాహ్మణులకు పార్టీని చేరువ చేసేందుకు గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ప్రబుధ్ వర్గ సమ్మేళనం ముగింపు సందర్భంగా మంగళవారం నాడిక్కడ ఒక కార్యక్రమంలో మాయావతి ప్రసంగిస్తూ బిజెపి, సమాజ్వాది పార్టీలు మాటలు చెప్పేవే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకోసం చేసిందేమీ లేదని విమర్శించారు. దళితులు, బ్రాహ్మణుల ఓట్లను కొల్లగొట్టేందుకు శుష్క వాగ్దానాలు చేసిన బిజెపి, ఎస్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వర్గాల ప్రయోజనాల కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆమె ఆరోపించారు. అయితే, బిఎస్పి ఆ పార్టీల్లాంటిది కాదని, తమ పార్టీ మాటలు, చేతలకు ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, ఇందుకు 2007 నుంచి 2012 వరకు యుపిలో సాగిన తమ పాలనే సాక్షమని మాయావతి చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నపుడు మీరట్, ముజఫర్నగర్లో మత ఘర్షణలు చెలరేగాయని, మైనారిటీలకు రక్షణ కల్పించడంలో కాంగ్రెస్ విఫలమైందని కూడా ఆమె ఆరోపించారు.