హీరో ప్రభాస్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఆయన కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఉండిపోతున్నారు. ఇటీవలే తన కొత్త చిత్రం షూటింగ్ను జార్జియాలో ముగించుకొని ప్రత్యేక విమానంలో ఇండియా చేరిన ప్రభాస్ ప్రస్తుతం ఇంటికి పరిమితమయ్యారు. ప్రాణాంతక కరోనా వైరస్ ఇండియాలో సైతం విజృంభిస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా అనేక కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో సెలెబ్రిటీలు ప్రజలలో అవగాహన కల్పించడం కోసం ఇలా స్వీయ నిర్భంధం విధించుకుంటున్నారు. అత్యవసరమైతే తప్పితే బయట తిరగొద్దు, అలాగే సోషల్ లైఫ్ వదిలేయమని కోరుతున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్న పీరియాడిక్ లవ్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. యువి క్రియేషన్స్ భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా… తెలుగు, హిందీ, తమిళ భాషలలో ఈ సినిమా విడుదలకానుంది. ప్రభాస్ 20వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.