హైదరాబాద్: ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో పాల్గొనేందుకు దేశ, విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 50 కోట్ల మందికి పైగా ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. మరికొన్ని రోజుల్లో కుంభమేళా ముగియనుడంతో భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు చేసేందుకు పెద్ద ఎత్తున పయనమవుతున్నారు.
అలా కుంభమేళాకు వెళ్దామని ప్లాన్ చేసుకున్న భక్తులకు రైల్వేశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రయాగ్రాజ్కు వెళ్లాల్సిన రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి ప్రయాగ్రాజ్ మీదుగా దానాపూర్ వెళ్లాల్సిన 12791 నెంబర్ రైలు బుధవారం ఉదయం 9.25 గంటలకు బయల్దేరాల్సి ఉంది. కానీ, మంగళవారం రాత్రి 7.35 గంటలకు ఈ రైలును రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కుంభమేళ వెళ్లేందుకు నెల, రెండు నెలల మందే రిజర్వ్ చేసుకున్న దాదాపు 1500 మంది ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్మీడియాలో రైల్వేశాఖపై విమర్శలు గుప్పిస్తున్నారు.