మనతెలంగాణ/హైదరాబాద్ : గద్వాల్లో కాన్పు కోసం 200 కిలోమీటర్ల ప్రయాణం చేసి, నాలుగు ఆసుపత్రులు తిరిగి చిరరకు గర్భిణి మృతి చెందిన ఘటనపై శుక్రవారం నాడు హైకోర్టులో విచారణ జరిగింది.
కాన్పుల కోసం, వైద్య పరీక్షల నిమిత్తం గర్భిణీలను ఆసుపత్రులకు తీసుకెళ్లే ప్రైవేట్ వాహనాలకు పోలీసులు, ఇతర అధికారులు ఎలాంటి పాస్లు అడగొద్దని కోర్టు ఆదేశించింది. ఈక్రమంలో పరిహారం చెల్లింపుపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశించింది. గర్భిణి మృతి చెందిన ఘటనపై విచారణ జరుగుతోందని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో రెడ్జోన్లలో కరోనా యేతర వైద్యసేవలకు అంబులెన్సులు అందుబాటులో ఉంచాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. రెడ్జోన్లలో నోడల్ అధికారులను నియమించి విస్తృ్తత ప్రచారం కల్పించాలని, ఆస్పత్రుల్లో గర్భిణిలకు వైద్యసేవలందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది.