Sunday, September 8, 2024

బిజెపి మేనిఫెస్టోపై ప్రజల్లో సానుకూలత

- Advertisement -
- Advertisement -

బిసి ముఖ్యమంత్రి  హామీ అందరిని ఆకర్షిస్తోంది
కాంగ్రెస్‌తోనే తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయింది: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ ప్రజలు ఇటీవల బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టో పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని, బీసీ ముఖ్యమంత్రి హామీ అందరినీ ఆకర్షిస్తోందని కేంద్రమంత్ర, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హోటల్ కత్రియాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ యువత, మహిళలు ప్రధాని మోదీకి అండగా నిలబడుతున్నారన్నారు. కాంగ్రెస్ కుటుంబాల నుంచి వచ్చినవారు కూడా కమలం పార్టీకి జైకొడుతున్నట్లు చెప్పారు. ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉండేది తమ పార్టీ మాత్రమేననే అభిప్రాయం అందరిలోనూ ఉందన్నారు. ఇతర పార్టీల నేతల మాటలు కోటలు దాటుతాయని, కానీ చేసే పని మాత్రం గాంధీ భవన్ కూడా దాటవని ఎద్దేవా చేశారు. ఏడు దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చిందని, కానీ ప్రజలకు విషాదమే మిగిల్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ కారణంగా తెలంగాణ అనేక రకాలుగా నష్టపోయిందన్నారు.

తెలంగాణ ఉద్యమంలో తొలి విడతలో 369 మంది, మలివిడతలో 1200 మందిని కాంగ్రెస్ బలితీసుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇస్తోన్న ఫేక్ గ్యారెంటీలను తెలంగాణ ప్రజలు నమ్మడం లేదన్నారు. కాంగ్రెస్ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తున్నాయని మండిపడ్డారు. బడుగు బలహీనవర్గాలు, షెడ్యూల్ తెగల ప్రజలు బీజేపీని విశేషంగా ఆదరిస్తున్నారన్నారు. చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తమ పార్టీ ముందంజలో ఉందని, తెలంగాణలో ఒక నిశ్శబ్ద విప్లవం కనిపిస్తోందని చెప్పారు. కాంగ్రెస్,మజ్లిస్‌కు వ్యతిరేకంగా ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, బీజేపీని ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారన్నారు. కొన్ని సర్వే సంస్థలు దొంగ లీకేజీలు ఇస్తున్నప్పటికీ బీజేపీ అభ్యర్థులకు ఏమాత్రం ఆదరణ తగ్గడం లేదన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News