Friday, October 18, 2024

నిండు జీవితానికి రెండు చుక్కలు….

- Advertisement -
- Advertisement -
Pulse Polio Drive Programme 2022
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యేలు,కార్పొరేటర్లు
మొదటి రోజు 60శాతం పిల్లలకు వేసినట్లు వైద్యశాఖ వెల్లడి
మూడు రోజుల పాటు ఇంటింటికి తిరిగి వేయనున్న వైద్య సిబ్బంది

హైదరాబాద్: నగరంలో పోలియో మహమ్మారిని ప్రారదోలేందుకు వైద్యశాఖ నేడు పల్స్ పోలియో కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీర్ హరీష్‌రావు ఇందిరాపార్కు వద్ద కేంద్రాన్ని ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో రహిత నగరాన్ని చేయాలని ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రజలు సహకరించాలని కోరారు. అదే విధంగా జిల్లా కలెక్టర్ శర్మన్ బొగ్గులకుంట యుపీహెచ్‌సీ కేంద్రాన్ని సందర్శించి అక్కడకు వచ్చిన పిల్లలకు పోలియో చుక్కలు వేసి పిల్లల తల్లిదండ్రులకు ఆరోగ్య సమస్యలపై పలు సూచనలు చేశారు. పోలియో సోకితే ఎంతో బాధపడాల్సి వస్తుందని అలా జరగకుండా తెలంగాణ పోలియో రహిత తెలంగాణ మార్చడానికి అందరు సహకరించాలని సూచించారు.

నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి బంజారాహిల్స్ ఎన్‌బిటి నగర్‌లో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్ని పలువురు చిన్నారులకు ఆమె చుక్కలు వేశారు. లాలాపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి, శేరిలింగంపల్లి నియోజకవర్గం అల్వాన్ కాలనీ డివిజన్‌లో ఎల్లమ్మబండలో,హాఫీజ్‌పేటలో ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రారంభించగా, కుషాయిగూడలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కంటోన్మెంట్‌లో సాయన్న, ఖైరతాబాద్‌లో దానం నాగేందర్, ముషీరాబాద్‌లో ముఠాగోపాల్, అంబర్‌పేట కాలేరు వెంకటేష్, సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పద్మారావు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో 15 నియోజకవర్గాల పరిధిలో బస్తీ దవఖానలు, యుపిహెచీసీ కేంద్రాల్లో స్దానిక ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కార్యక్రమం ప్రారంభించారు.

అనంతరం వారు మాట్లాడుతూ వైద్యశాఖ గుర్తించిన చిన్నారులందరికి వైద్యసిబ్బంది ఇంటింటికి తిరిగి డ్రాప్స్ వేసి చిన్నారులకు పోలియో సోకకుండా చూడాలని సూచించారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు వైద్యసిబ్బంది సెంటర్లలో అందుబాటులో ఉండి అక్కడికి వచ్చిన చిన్నారులకు చుక్కలు వేశారు. జిల్లాలో 5,09,461మంది చిన్నారుల కోసం 2800 బూత్‌లు, 85 ట్రాన్సిట్‌పాయింట్లు, 113 మొబైల్ పాయింట్లు ఏర్పాటు చేశారు. హైరిస్క్ ప్రాంతాలు, బస్తీలు, సంచార జాతులున్న ప్రదేశాలు, రైల్వేస్టేషన్లు,బస్టాండ్‌లు ప్రాంతాల్లో ఏఎన్‌ఎం, ఆశవర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బందితో పాటు నర్సింగ్ పారామెడికల్ విద్యార్దులు, ఎన్‌సీసీ క్యాడెట్లు, లయన్స్ క్లబ్ వాలంటీర్లు పాల్గొన్నట్లు జిల్లా వైద్యాధికారులు పేర్కొన్నారు. మొదటిరోజు పల్స్ పోలియో చుక్కలు వేయించుకోని వారికి మార్చి 2వ తేదీ వరకు పంపిణీ చేస్తామని, గడగ గడపకు తిరిగి గుర్తించిన ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేస్తామని చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News