130 రోజుల పాటు సాగిన నిరాహార దీక్ష
తమ పోరు కొనసాగుతుందన్న రైతు నేత
చండీగఢ్ : పంటలకు కనీస మద్దతు ధరపై చట్టబద్ధమైన గ్యారంటీతో సహా ఉద్యమ రైతుల వివిధ కోర్కెలకు మద్దతుగా నిరుడు నవంబర్ 26న ప్రారంభించిన తన నిరశన దీక్షను పంజాబ్ రైతు నేత జగ్జీత్ సింగ్ దల్లెవాల్ ఆదివారం విరమించారు. తన ఆమరణ నిరాహార దీక్షను విరమించవలసిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ విజ్ఞప్తి చేసిన మరునాడు దల్లెవాల్ ఈ ప్రకటన చేశారు. పంజాబ్ ఫతేగఢ్ సాహిబ్ జిల్లా సిర్హింద్లో ధాన్యం మార్కెట్లో నిర్వహించిన ‘కిసాన్ మహాపంచాయత్’లో తన నిరవధిక నిరశన దీక్ష విరమిస్తున్నట్లుగా దల్లేవాల్ ప్రకటించారు. పంటలకు ఎంఎస్పికి చట్టబద్ధమైన గ్యారంటీ.
తదితర డిమాండ్లపై తమ పోరు కొనసాగుతుందని అదే సమయంలో ఆయన స్పష్టం చేశారు. దల్లెవాల్ ఒక స్ట్రెచర్పై నుంచి సభికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ‘ఆమరణ నిరాహార దీక్ష విరమించవలసిందని మీరంతా కోరారు. నాకుప్రజలు దైవ స్వరూపులు. నేనే ప్రకటించిన రూపంలో ఉద్యమాన్ని మీరు పరికించిన తీరుకు నేను మీకు రుణపడ్డాను. మీ మనోభావాలను మన్నిస్తాను’ అని చెప్పారు. ‘మోర్చా (ఆందోళన) కొనసాగుతుంది.
ఇప్పటికీ నిరవధిక నిరశన విరమించాలని నేను కోరుకోవడం లేదు. కానీ (దీక్ష విరమించాలని) మీరు నన్ను పదే పదే కోరారు. నేను దానిని మన్నిస్తాను’ అని దల్లెవాల్ చెప్పారు. ఆందోళనకు మద్దతు సూచనగా చేతులు ఎత్తవలసిందిగా సభికులను దల్లెవాల్ కోరారు. నిరాహార దీక్ష విరమించవలసిందిగా దల్లెవాల్కు కేంద్ర మంత్రి శివరాజ్ చౌహాన్ శనివారం విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి బిట్టూ కూడా దల్లెవాల్కు అదే విధమైన విజ్ఞప్తిని శనివారం చేశారు.