Saturday, October 26, 2024

తీరు మారని సింధు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు వరుస పరాజయాలతో నిరాశ పరుస్తోంది. తాజాగా కొరియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో సింధు తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఒకప్పుడూ మహిళల బ్యాడ్మింటన్‌లో ఎదురులేని శక్తిగా కొనసాగిన సింధు కొంత కాలంగా పేలవమైన ఆటతో సతమతమవుతోంది. టైటిల్ సాధించడం అటుంచి కనీసం క్వార్టర్ ఫైనల్‌కు చేరడమే గగనంగా మారిపోయింది. కొన్నేళ్ల క్రితం వరకు మహిళల బ్యాడ్మింటన్‌లో సింధు స్టార్ షట్లర్‌గా ఓ వెలుగు వెలిగింది. ఒలింపిక్స్‌తో సహా ప్రపంచ ఛాంపియన్ వంటి మెగా టోర్నమెంట్‌లలో మెరుగైన ప్రదర్శనతో అలరించింది. కానీ రానురాను సింధు ఆట తీరు అత్యంత పేలవంగా తయారైంది. ర్యాంకింగ్స్‌లో కూడా సింధు కిందికి పడిపోయింది.

చైనా, కొరియా, జపాన్, తైపీ, ఇండోనేషియా, స్పెయిన్, డెన్మార్క్‌లకు చెందిన షట్లర్లు వరుస టైటిల్స్‌తో పెను ప్రకంపనలు సృష్టిస్తుండగా సింధు వరుస ఓటములను చవిచూస్తోంది. సింధు ఆట రోజురోజుకు తీసికట్టుగా మారడంతో ఆమె కెరీర్ ప్రమాదంలో పడిందనే చెప్పాలి. ఎంతో ప్రతిభ ఉన్నా సింధు మాత్రం దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోతోంది. ఈ ఏడాది ఓ టోర్నమెంట్‌లో మాత్రమే సింధు మెరుగైన ప్రదర్శన చేసింది. మిగిలిన టోర్నమెంట్‌లలో క్వార్టర్ ఫైనల్ దశ కూడా దాటలేక చేతులెత్తేస్తోంది. ఓ దశలో ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి షట్లర్‌గా కొనసాగిన సింధు ప్రస్తుతం అనామక క్రీడాకారిణిగా మారిపోయింది. తనకంటే కింది స్థాయి ర్యాంకింగ్ కలిగిన షట్లర్లను సయితం ఓడించలేక పోతోంది. ఇప్పటికైనా సింధు తన ఆటను మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే రానున్న సింధు కెరీర్ ప్రశ్నార్థకంగా మారడం ఖాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News