దేశవ్యాప్తంగా 2020-2024లో 51 ర్యాగింగ్ మరణాలు సంభవించాయని, ఇదే కాలంలో జరిగిన కోచింగ్ హబ్ కోటా ఆత్మహత్యలకు సమానమని ఓ నూతన నివేదిక వెల్లడించింది. సొసైటీ ఎగనెస్ట్ వాయలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్(సేవ్) తన ‘స్టేట్ ఆఫ్ ర్యాగింగ్ ఇన్ ఇండియా 2020-2024’ నివేదికలో ఈ విషయాన్ని పేర్కొంది. ఫిర్యాదుల ప్రకారం మెడికల్ కాలేజ్లే ‘హాట్స్పాట్స్’ అని ఆ నివేదిక పేర్కొంది. వాస్తవానికి మొత్తం విద్యార్థుల్లో మెడికల్ విద్యార్థుల సంఖ్య 1.1శాతమే అయినప్పటికీ మెడికల్ కాలేజ్ల నుంచే 38.6 శాతం ఫిర్యాదులు అందాయి. 2020-2024లో సీరియస్ ఫిర్యాదులు 35.4 శాతం కాగా, 45.1 శాతం ర్యాగింగ్ మరణాలవి ఉన్నాయి. ఈ కాలంలో ర్యాగింగ్ కారణంగా 51 మంది చనిపోయారని,
ఇది కోటాలో రిపోర్టయిన 57 విద్యార్థుల ఆత్మహత్యలకు దరిదాపని నివేదిక పేర్కొంది. మూడేళ్లలో అందిన ర్యాగింగ్ ఫిర్యాదులు 3156. ర్యాగింగ్కు గురైన వారిలో కొద్ది మందే ఫిర్యాదు చేయడానికి ధైర్యం చేసి ముందుకొచ్చారన్నది మరో వాస్తవం. చాలా మంది నిజానికి ఎలాంటి ఫిర్యాదులు చేయకుండానే గుంబనంగా కుమిలిపోతున్నారన్నది మరో వాస్తవం. ర్యాగింగ్ను ఆపాలంటే ప్రతి కాలేజ్లో నిబద్ధత కలిగిన సెక్యూరిటీ గార్డ్లతో యాంటీ ర్యాగింగ్ స్వాడ్లను ఏర్పాటు చేయాలి. హాస్టళ్లలో సిసిటివి నిఘా పెట్టి భద్రతా సిబ్బంది, యాంటీ ర్యాగింగ్ కమిటీలు, తల్లిదండ్రులు మానిటర్ చేసేలా చూడాలి. అంతేకాక ఫ్రెషర్స్కు సపరేట్ హాస్టల్స్ సదుపాయాన్ని కల్పించాలి, ఒకవేళ ర్యాగింగ్ జరిగితే 24 గంటల్లో దానికి సంబంధించిన పోలీస్ ఫిర్యాదు దాఖలు కావాలి అని నివేదిక పేర్కొంది.