హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బీజేపీ నేత, మెదక్ లోక్సభ సభ్యుడు రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 400 ఎకరాల భూముల అంశంలో దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉందని కేటీఆర్, హరీశ్ రావునుద్దేశించి అన్నారు. బీఆర్ఎస్ నేతల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో భూములను అడ్డగోలుగా అమ్మేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ప్రశ్నిస్తున్న కేటీఆర్, హరీశ్ రావు ఎక్కడకు పోయారని నిలదీశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) భూములపై ఎందుకు సమీక్ష చేయలేదో చెప్పాలన్నారు. హెచ్సీయూ రికార్డుల్లోకి ఎందుకు ఎక్కించలేదని నిలదీశారు.
ఇప్పుడు మాత్రం బీఆర్ఎస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. విశ్వ విద్యాలయ భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. హెచ్సీయూ భూములను కాపాడాలని తాము కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిశామని, ఇంచు భూమి పోకుండా విద్యార్థుల తరపున పోరాడుతామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం పై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన పర్యావరణ, కేంద్ర అటవీశాఖల సాధికారిక కమిటీతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోని భూములను బిజెపి నేతలు గురువారం పరిశీలించారు. అనంతరం కేంద్ర కమిటీతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు.