Saturday, September 21, 2024

పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన రాహుల్

- Advertisement -
- Advertisement -

లేహ్ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆయనకు నివాళులు అర్పించారు. కేంద్ర పాలిత ప్రాంతం లడ్డాఖ్ లోని లేహ్‌లో పర్యటిస్తున్న రాహుల్, భారత్‌చైనా సరిహద్దు ల్లోని పాంగాంగ్ సరస్సు కు శనివారం మోటార్ సైకిల్ యాత్ర చేపట్టారు. రాత్రి పాంగాంగ్ సరస్సు వద్ద ఉన్న టూరిస్టు క్యాంప్‌లో బస చేశారు. ఆదివారం రాజీవ్ గాంధీ జయంతిని ఈ సరస్సు వద్దే రాహుల్ నిర్వహించారు. గతంలో రాజీవ్‌గాంధీ భారత్ లోని వివిధ ప్రాంతాల్లో తీసిన ఫోటోలను ఎక్స్ (ప్రస్తుతం ట్విటర్) లో రాహుల్ షేర్ చేశారు.

“ పాపా (నాన్న) … భారత్ కోసం మీరు కన్న కలలను వెలకట్టలేని ఈ జ్ఞాపకాలు తెలియజేస్తున్నాయి. మీరు చూపిన మార్గం లోనే నడుస్తూ , ప్రతి భారతీయుడి కష్టాలను అర్థం చేసుకుంటూ భరత మాత గొంతును వింటున్నాను” అని రాజీవ్ గాంధీ తీసిన ఫోటోలకు సంబంధించిన వీడియోను రాహుల్ ట్వీట్ చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో రాజీవ్‌గాంధీ జయంతి సందర్భంగా సోనియా, ప్రియాంక గాంధీలు , కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తదితరులు నివాళులర్పించారు. ఆగస్టు 25 వరకు లేహ్‌లో పర్యటించనున్న రాహుల్ గాంధీ … అక్కడ జరిగే ఓ ఫుట్‌బాల్ మ్యాచ్‌ను కూడా వీక్షిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. లడ్డాఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కార్గిల్ ప్రాంతంలో కౌన్సిల్ ఎన్నికలు సెప్టెంబర్ 10న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పలువురితో రాహుల్ భేటీ కానున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News