Sunday, September 8, 2024

సింగరేణిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం నుంచి కురుస్తున్న భారీ వర్షం కారణంగా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో కొత్తగూడెంలోని సింగరేణి ఏరియా జే వి ఆర్, కిష్టారం,పి వి కే లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఎదురవుతోంది. వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్‌లోకి వరదనీరు చేరడంతో బొగ్గు వెలికితీయడం సాధ్యం కావడంలేదు. వర్షంతో గని నుంచి బయటకు వచ్చే రోడ్లు అన్ని చిత్తడిగా మారడంతో వాహనాలు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి సుమారు 1000 టన్నుల బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. సింగరేణి అధికారులు మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడే ప్రయత్నం చేస్తున్నారు.

శనివారం మొదటి షిఫ్ట్ నిలిపివేయగా వర్షం తగ్గితే రెండో షిఫ్ట్ పనులు ప్రారంభిస్తామని సింగరేణి అధికారులు తెలిపారు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సింగరేణిలో రోజుకు 1.05 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. వర్షాలు ప్రారంభమైన రెండు రోజులు నామమాత్రంగా బొగ్గు ఉత్పత్తి సాగినా, ఆ తర్వాత ఓవర్బర్డెన్ వెలికితీత పూర్తిగా నిలిచిపోయింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లోని 25 భూగర్భగనులు, 20 ఓపెన్కాస్ట్ (ఓసీ) గనుల్లో వర్షాకాలం కారణంగా తగ్గించిన లక్ష్యం మేరకు రోజుకు 1.84 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ ఓసీల్లో 45 వేల టన్నులు, భూగర్భగనుల్లో 15 వేల టన్నుల ఉత్పత్తి మాత్రమే జరుగుతోంది.

సింగరేణి వ్యాప్తంగా రోజుకు 14 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు కూడా స్తంభించిపోయింది. కొత్తగూడెం ఏరియా నుంచి రోజుకు సుమారు 32 వేల టన్నుల బొగ్గు రవాణా జరగాల్సి ఉండగా రోజుకు 10 నుండి 15 వేల టన్నుల బొగ్గునే రవాణా చేస్తున్నారు. మొత్తంగా ముడు రోజుల నుండి సింగరేణి పరిధిలో కొన్ని లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం వాటిల్లగా వారంలో సుమారు రూ.100 కోట్ల మేర ఆదాయం మేర నష్టం జరిగినట్లు చెబుతున్నారు. సింగరేణి వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 480 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News