కన్నడ డైనమిక్ ప్రిన్స్ ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాక్షస. ఈ చిత్రం మార్చి 7న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఒరిజినల్ వర్షన్ కన్నడతో పాటు తెలుగులోనూ అదేరోజు విడుదలవుతోంది. కంచి కామాక్షి కోల్ కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్ పై రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. వేణు ఉన్ని సంగీతం అందించగా, కాంతారా, విరూపాక్ష లాంటి థ్రిల్లర్స్కు సూపర్ హిట్ సంగీతం అందించిన అజనీష్ లోక్నాథ్ ఈ చిత్రానికి సౌండ్ ట్రాక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. తాజాగా ఈ మూవీ టైటిల్ సాంగ్ను రిలీజ్ చేశారు. సినిమా కాన్సెప్ట్ ను తెలియజేసేలా సాగిన ఈ పాట అందర్నీ ఆకట్టుకుంటోంది. వేణు ఉన్ని కంపోజ్ చేసిన పాటకు అజనీష్ లోక్ నాథ్ అందించిన సౌండ్ ట్రాక్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తున్నాయి.
‘మాయలో మాయకి చిక్కినాక.. దారిలో కానరాక చొచ్చుకెళ్లాక.. రూపమే అదృశ్యం అయ్యాక..’ అంటూ సాగిన పాటకు ప్రేమ్ బిఎస్ అర్థవంతమైన లిరిక్స్ ను అందించగా, సాయి చరణ్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్మాత ఎంవిఆర్ కృష్ణ మాట్లాడుతూ “ప్రజ్వల్ దేవరాజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు, ట్రైలర్కు మంచి ఆదరణ దక్కింది. విడుదల చేసిన పాట కూడా ప్రతి ఒక్కరూ బాగుందని చెబుతున్నారు. ముఖ్యంగా ‘కాంతారా‘ ఫేం అజనీష్ లోక్ నాథ్ సౌండ్ ట్రాక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ పాట తరహాలోనే సినిమా కూడా అందరూ ఇష్టపడేలా ఉంటుంది. రాక్షస చిత్రానికి సెన్సార్ వాళ్లు యు/ఎ సర్టిఫికేట్ జారీ చేశారు. ఇక ఈ మూవీ రన్ టైమ్ 2 గంటల 13 నిమిషాలు ఉంది. మేము అనుకున్న దానికంటే సినిమా ఎంతో అద్భుతంగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది”అని అన్నారు.