సన్నబియ్యం సంబురానికి సర్వంసిద్ధం
రాష్ట్రంలో పేదల ఇంట నిజమైన ఉగాది వేడుకలు
ప్రారంభం కానున్న సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం
హుజూర్నగర్లో ప్రారంభించనున్న సిఎం రేవంత్రెడ్డి
దేశంలోనే ఇది తొలిసారి 89.73లక్షల రేషన్కార్డుదారులకు
లబ్ధి గ్రామాలకు చేరుకున్న సన్నబియ్యం హుజూర్నగర్
సభ ఏర్పాట్లను పర్యవేక్షించిన మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి
హుజూర్నగర్లో
ప్రారంభించనున్న సీఎం రేవంత్
జనాభాలో 84% మందికి
చేకూరనున్న లబ్ధి
మన తెలంగాణ/హైదరాబాద్/హుజూర్నగర్: రాష్ట్రంలో ఈ ఏడాది ఉగాది పండగ చరిత్రపుటల్లో లిఖించదగ్గ రోజుగా నిలువనున్నది. దేశంలోనే తొలిసారిగా పేద ప్రజల ఆహారభద్రతకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టనున్నారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న పేదలతో పాటు మధ్యతరగతి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కలను రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చి కల సాకారం చేయబోతుంది.
చౌక ధరల దుకాణాలలో ఉచితంగా సన్న బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులు పప్పు, ఉప్పు, ఆయిల్ వంటి వాటిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. అంతే కాకుండా రేషన్ డీలర్ల కమిషన్ పెంపుదలకు ప్రయత్నిస్తున్నది. ఈ పధకం కింద రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల పది లక్షల మంది లబ్దిదారులకు నేరుగా ప్రయోజనం కలుగుతుంది. రాష్ట్ర జనాభాలో సుమారు 84 శాతం ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం లబ్ది చేకూరుతుంది.
పేదల ఆహార భద్రతకు పెద్దపీట: మంత్రి ఉత్తమ్
రాష్ట్రంలోని పేద ప్రజల ఆహార భద్రతకు తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్లోని రాజీవ్ గాంధీ ప్రాంగణం వేదికగా ఉగాది పర్వదినం సందర్భంగా ఆదివారం నిర్వహించనున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగసభ, సన్నబియ్యం పంపిణీ ఏర్పాట్లను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్కార్డు కలిగి ఉండి అర్హులైన పేదలందరికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా తమ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకానికి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టనున్నట్టు తెలిపారు.
దొడ్డుబియ్యం తినేందుకు ప్రజలు అనాసక్తత కనపరచడంతో పాటు దళారులకు అమ్ముకోవడం వలన పక్కదారి పడుతున్నాయని అన్నారు. వీటన్నింటినీ అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పథకానికి నిర్ణయం తీసుకుందని అన్నారు. అర్హులందరికీ నూతన రేషన్కార్డులు అందజేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరుకుంటుందన్నారు. ప్రభుత్వ చౌకధరల దుకాణాలను కేవలం బియ్యానికి మాత్రమే పరిమితం చేయకుండా ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తామన్నారు.
సిఎం పర్యటనకు పటిష్ట బందోబస్తు
హుజూర్నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం జరిగే ముఖ్యమంత్రి పర్యటన, బహిరంగ సభకు 1500 మంది పోలీస్ సిబ్బందితో పోలీసు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా జిల్లా ఎస్పి నరసింహ తెలిపారు. శనివారం సభా ప్రాంగణం, ఏర్పాట్లు, పార్కింగ్ స్థలాలను పరిశీలించి పోలీస్ అధికారులు, సిబ్బంది, ప్రత్యేక బలగాలతో సమావేశం నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు నిర్వహించాలని కిందిస్థాయి అధికారులకు సూచించారు.