Tuesday, March 25, 2025

భరత మాత ముద్దు బిడ్డలు

- Advertisement -
- Advertisement -

షహీద్ దివస్.. నేడు ఈ వీరుల త్యాగాలకు దేశం గర్విస్తోంది. భరతమాతను దాస్యశృంఖాల నుంచి విడిపించడానికి అసమాన పోరాటం చేసిన భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను నాటి బ్రిటిష్ ప్రభుత్వం అన్యాయంగా ఉరికంబం ఎక్కించింది. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ముగ్గురు యోధులు బలి దానం చేసిన రోజు. 23 ఏళ్లకు ఉరికంబం ఎక్కిన వీరుల త్యాగాలు ఎప్పటికే ఆదర్శమే. విప్లవం ద్వారా మాత్రమే స్వాతంత్య్రం లభిస్తుందని నమ్మిన తొలితరం విప్లకారుడు భగత్ సింగ్. చిన్న వయసులోనే ఆ ముగ్గురు వీరులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. ఉరిని కూడా ఆనందంగా స్వీకరించి బలిదానం చేసిన రోజు. ఆ వీరులు ప్రాణత్యాగం చేసిన నాటి రోజునే వారి జ్ఞాపకార్థ్ధం షహీద్ దివస్‌గా జరుపుకుంటున్నాం. ఆ ముగ్గురూ భగత్ సింగ్, సుఖ్‌దేవ్ థాపర్, శివ్‌రామ్ రాజ్‌గురులు. బ్రిటిష్ పాలన అంతం కావాలని వారికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టి 23 ఏళ్ల వయసులోనే ప్రాణత్యాగం చేసిన ఈ ముగ్గురు వీరులు నాటి తరానికే కాదు, నేటి యువతకు కూడా ఆదర్శం. ఉరికంబం ఎక్కడానికి ముందు కూడా తమ ముఖంలో చిరునవ్వు చెరగనివ్వని ఈ యోధు లు, చావును కూడా ఎంతో ఆనందంగా స్వీకరించారు. 1931 మార్చి 23న ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న లాహోర్ లోని సెంట్రల్ జైల్లో ఉరి తీశారు. వారి మృతదేహాలను రహస్యంగా హుస్సేనివాలాకు తరలించారు. భరత మాతను బ్రిటిషర్ల చెర నుంచి విడిపించి దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారుల్లో భగత్‌సింగ్ ఒకరు. అందుకే ఆ విప్లవ వీరుడిని షహీద్ భగత్ సింగ్‌గా పిలుస్తారు. 1907 సెప్టెంబరు 28న ప్రస్తుత పాకిస్థాన్‌లోని లాహోర్‌లో జన్మించిన భగత్ సింగ్ చిన్నవయసులోనే జాతీయోద్యమంలో పాల్గొన్నారు. తనకు వివాహం చేయాలన్న తల్లిదండ్రుల నిర్ణయం తెలుసుకున్న భగత్, ఆ ప్రయత్నాన్ని మానుకోమని ఉత్తరం రాసిపెట్టి ఢిల్లీకి చేరారు. దైనిక్ అర్జున్, ప్రతాప్ లాంటి పత్రికల్లో కొంతకాలం పనిచేసిన భగత్ సింగ్‌కు ఆ సమయంలోనే గణేష్ విద్యార్థి, బటుకేశ్వరదత్ లాంటి విప్లవకారుల సహచర్యం లభించింది. విప్లవం ద్వారా మాత్రమే స్వాతంత్య్రం సిద్ధించగలదని భావించిన భగత్ సింగ్ ‘నౌ జవాన్ భారత్ సభ’ ను 1924లో స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, భగవతీ చరణ్‌లు ఆ సమయంలో తమ రక్తంతో ప్రమాణ పత్రంపై సంతకం చేశారు. అప్పుడే కాన్పూర్‌లో వరదలు రావడంతో సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకున్న భగత్ సింగ్‌కు చంద్రశేఖర్ ఆజాద్‌తో పరిచయం ఏర్పడింది. తరువాతి కాలంలో వారు ప్రాణ స్నేహితులుగా మారారు. నౌ జవాన్ భారత సభ ద్వారా యువతను ఆకర్షించడమే కాకుండా వారిలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించారు. చిన్నతనంలో ఐరోపా విప్లవ ఉద్యమాల గురించి చదివి సామ్యవాదానికి ఆకర్షితులయ్యాడు. ఈ స్ఫూర్తితో హిందూస్థాన్ గణతంత్ర సంఘంలో ముఖ్య నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. ఆ తర్వాత ఈ సంస్థను హిందూస్థాన్ సామ్యవాద గణతంత్ర సంఘంగా మార్చారు. రాజకీయ ఖైదీలకు సమాన హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ జైలులో 64 రోజుల నిరాహార దీక్షను చేపట్టడం ద్వారా భగత్ సింగ్ అఖండ భారతావని మద్దతును కూడగట్టుకున్నాడు. పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ మరణానికి కారణమైన పోలీస్ అధికారి స్కాట్స్ హత్యకు భగత్ సింగ్ వేసిన పథకం విఫలమైంది. స్కాట్స్ అనుకుని మరో ఎస్‌ఐ సాండర్స్‌ను హత్య చేశారు. 1929 ఏప్రిల్ 8న పార్లమెంట్‌‌ హాల్‌లో పొగబాంబు విసరడంతో భగత్ సింగ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. తన స్వాతంత్య్ర కాంక్షను తెలియజేయడానికే బాంబు వేశాం తప్ప, ఎవరినీ హత్య చేయడానికి కాదంటూ ధైర్యంగా న్యాయస్థానంలోనే ఆయన ప్రకటించారు. భగత్ సింగ్‌తోపాటు సుఖ్‌దేవ్, రాజ్‌గురులు కూడా ఈ దాడిలో పాల్గొన్నారు. పార్లమెంట్ హాల్లో మనుషులు లేని ప్రదేశంలోని సాధారణ బాంబు విసిరి భారతీయుల మనోగతాన్ని తెలియజేయాలన్నదే ఈ వీరులు ప్రధానోద్దేశం. అయితే దీన్ని తీవ్రంగా పరిగణించిన బ్రిటిష్ ప్రభుత్వం విచారణ త్వరగా పూర్తిచేసి ఉరిశిక్షను అమలు చేసింది. తన కొడుకును కేసునుంచి బయటపడేయడానికి భగత్ సింగ్ తండ్రి చాలా ప్రయత్నించారు. అయితే తండ్రి ప్రయత్నాలను వారించిన ఆయన, దీని వల్ల ప్రయోజనం ఉండదని తెలిపాడు. మమ్మల్ని విడిచిపెట్టే ఉద్దేశం బ్రిటిష్ ప్రభుత్వానికి లేదు కాబట్టి దీనిపై దొంగ సాక్ష్యాలను సృష్టించి విచారణను వేగంగా పూర్తిచేయడానికి ఏర్పాటు చేస్తుందంటూ తెల్లదొరల అంతరంగాన్ని ముందే పసిగట్టి తండ్రికి తెలియజేశారు భగత్‌సింగ్. అనుకున్నట్టుగానే ఈ ముగ్గురు వీరుల్ని బ్రిటిష్ ప్రభుత్వం దోషులుగా నిర్ధారించి ఉరికంబం ఎక్కించింది. మార్చి 23 న సెంట్రల్ జైలులో సాయంకాలం 7.33 గంటలకు విప్లవ వీరులను ఉరి తీశారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఉరితాడును ముద్దాడి, ప్రాణత్యాగం చేశారు. నిబంధనల ప్రకారం ఆ సమయంలో ఉరిశిక్ష అమలులో లేదు. అందుకే వారి మృతదేహాలను జైలు వెనుక గోడలు పగులగొట్టి రహస్యంగా తీసుకెళ్లి సట్లెజ్ నదీ తీరాన దహనం చేశారు. మృతదేహాలు ప్రజల కంటబడితే ఉపద్రవం ముంచుకొస్తుందనే ఇలా చేశారు. ఈ అమరవీరుల త్యాగం ఎప్పటికీ వృథా కాదు, ఓ అమరుడా ఎల్లవేళలా ప్రతి భారతీయ గుండెల్లో ఉంటారు మీ త్యాగం అందుకో మా ప్రత్యేక జోహార్లు.

– నరేష్ జాటోత్, 82478 87267

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News