Saturday, October 5, 2024

రియల్ ఢమాల్

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలో రూ.300-400కోట్లు తగ్గిన రాబడి

ఈ ఆరు నెలల్లో 8,89,019 లక్షల డాక్యుమెంట్‌లకు రిజిస్ట్రేషన్….
ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు ఆదాయం పెరిగినా తగ్గిన రిజిస్ట్రేషన్‌లు
సెప్టెంబర్‌లో ఆదాయంతో పాటు తగ్గిన రిజిస్ట్రేషన్‌లు

మందగించిన రిజిస్ట్రేషన్లు హైడ్రా చర్యలు, లేఅవుట్లకు అనుమతుల్లో జాప్యమే కారణం

మనతెలంగాణ/హైదరాబాద్:  స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈసారి ఆశించిన ఆదాయాన్ని ఆర్జించడం లేదని ఆ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 8,89,019 లక్షల డాక్యుమెంట్‌లకు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.7,253 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. గత సంవత్సరం ఇదే సమయంలో 9,11,436 డాక్యుమెంట్‌లకు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.7,668 కోట్ల ఆదాయం రావడం విశేషం. ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు ఆదాయం (26 శాతం) పెరిగి రిజిస్ట్రేషన్‌లు తగ్గగా, సెప్టెంబర్ నెలలో మాత్రం ఆదాయంతో పాటు డాక్యుమెంట్‌లు తగ్గిపోయాయని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో రూ.300ల నుంచి రూ.400 కోట్ల ఆదాయం తగ్గిందని అధికారులు పేర్కొంటున్నారు.

గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం…

గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 33,451 తక్కువ రిజిస్ట్రేషన్‌లు జరగ్గా, రెవెన్యూ మాత్రం 28 శాతం పెరిగింది. ఇక మే నెలలోనూ 28,637 తక్కువ రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రెవెన్యూ కూడా మైనస్ 238 శాతానికి తగ్గిపోయింది. జూన్ నెలలో గత సంవత్సరం కన్నా ఈసారి 1,133 రిజిస్ట్రేషన్‌లు అధికంగా జరగ్గా, రెవెన్యూ 113 శాతం పెరిగింది. జూలై నెలలో గత సంవత్సరం కన్నా ఈసారి 31,883 రిజిస్ట్రేషన్‌లు అధికంగా జరగ్గా, రెవెన్యూ 452 శాతం పెరిగింది. ఇక ఆగష్టు నెలలో 52,387 తక్కువ రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రెవెన్యూ మాత్రం 365 శాతానికి పెరిగింది. సెప్టెంబర్ నెలలో 99,970 రిజిస్ట్రేషన్‌లు జరగ్గా, రూ.820 కోట్ల ఆదాయం వచ్చింది. ఇలా సెప్టెంబర్ నెలకు సంబంధించి డాక్యుమెంట్‌లలోనూ, ఆదాయంలోనూ సుమారుగా 20 శాతానికి పైగా ఆ శాఖ ఆదాయాన్ని కోల్పోవడం విశేషం.

రెండునెలలుగా అనుమతుల్లో ఆలస్యం

హైడ్రాతో పాటు వరుసగా వచ్చిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రిజిస్ట్రేషన్‌లు తగ్గాయని అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైడ్రా దెబ్బకు హెచ్‌ఎండిఏ, డిటిసిపి అధికారులు అనుమతుల విషయంలో ఆచితూచి వ్యవహారిస్తుండడం కూడా రిజిస్ట్రేషన్ల తగ్గుదలకు కారణంగా తెలుస్తోంది. రెండునెలలుగా అనుమతుల విషయంలో అధికారులు సైతం మీనమేషాలు లెక్కిస్తుండడంతో బిల్డర్‌లు, రియల్టర్‌లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2022, 23 ఆర్థిక సంవత్సరంలో 19.44 లక్షల డాక్యుమెంట్‌లు

2022, 23 ఆర్థిక సంవత్సరంలో 19.44 లక్షల డాక్యుమెంట్‌ల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.14,291 కోట్ల ఆదాయ రాగా, 2023, 24 ఆర్థిక సంవత్సరంలో 12,01,899 డాక్యుమెంట్‌ల ద్వారా రూ.14,483 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం ఈ సంవత్సరం (2024, 25)కు సంబంధించి ఏప్రిల్ టు సెప్టెంబర్ వరకు 8,89,019 లక్షల డాక్యుమెంట్‌లకు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.7,253 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

ఏప్రిల్ నుంచి ఆగష్టు వరకు….

2023 ఏప్రిల్‌లో 1,55,565 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.1,087 కోట్ల ఆదాయం వచ్చింది. 2024 ఏప్రిల్‌లో 1,22,114 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ.1,115 కోట్ల ఆదాయం సమకూరింది. 2023 మే నెలలో 1,74,998 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.1,317 కోట్ల ఆదాయం, 2024 మే నెలలో 1,46,361 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ.1,079 కోట్లు, 2023 జూన్ నెలలో 1,66,022 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.1,180 కోట్లు, 2024 జూన్‌లో 1,67,155 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ.1,293 కోట్ల ఆదాయం సమకూరింది. 2023 జూలైలో 1,72,893 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.1,187 కోట్ల ఆదాయం, 2024 జూలైలో 2,04,776 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ.1,639 కోట్ల ఆదాయం, 2023 ఆగష్టులో 1,71,958 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్ జరగ్గా రూ.1,297 కోట్ల ఆదాయం, 2024 ఆగష్టులో 1,48,643 డాక్యుమెంట్‌లు రిజిస్ట్రేషన్‌లు జరగ్గా రూ.1,307 కోట్ల ఆదాయం వచ్చిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.

2021,22 ఆర్థిక సంవత్సరంలో ఆల్‌టైం రికార్డు

2021,22 ఆర్థిక సంవత్సరంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు రూ.12,364 కోట్ల రాబడి, 19.88 డాక్యుమెంట్ల ద్వారా రావడం, దీనిని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఆల్‌టైం రికార్డు ఆదాయంగా పేర్కొంటారు. దీని తరువాత స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం పెరుగుతూ వస్తోంది. 2014,15 సంవత్సరంలో రూ.2,707 కోట్లు రాగా, 2015,16 సంవత్సరంలో 10.62 డాక్యుమెంట్‌లు రూ.3,786 కోట్ల ఆదాయం, 2016,17 సంవత్సరంలో 10.63 లక్షల డాక్యుమెంట్‌లు, రూ.4,249 కోట్లు, 2017, 18 సంవత్సరంలో 11.50 లక్షల డాక్యుమెంట్‌లు రూ.5,177 కోట్ల ఆదాయం సమకూరింది. 2018-,19 ఆర్థిక ఏడాదిలో 15.2 లక్షల డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా రూ.6,612.75 కోట్లు ఆదాయం రాగా, 2019-,20 ఆర్థిక సంవత్సరంలో 16.58 లక్షల డాక్యుమెంట్ల ద్వారా రూ.7,061 కోట్ల రాబడి, 2020-,21 ఆర్థిక సంవత్సరంలో 12.11లక్షల డాక్యుమెంట్‌లు, రూ.5,260.20 కోట్ల ఆదాయం సమకూరడం విశేషం.ఈ ఆదాయంలోనూ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలో టాప్‌లో ఉండడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News