Tuesday, April 15, 2025

స్లాట్ బుకింగ్ విధానంలో రిజిస్ట్రేషన్లు

- Advertisement -
- Advertisement -

ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి ప్రయోగాత్మకంగా 22
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అందుబాటులోకి ఇక నుంచి 10
నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి ప్రతి సబ్
రిజిస్ట్రార్ 48 స్లాట్లను పూర్తి చేసేలా చర్యలు డబుల్
రిజిస్ట్రేషన్లను అరికట్టడానికి చట్టసవరణ : మంత్రి పొంగులేటి

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సమర్ధవంతంగా సులువుగా, వేగవంతంగా, పారదర్శకంగా, అవినీతిరహితంగా మరిం త మెరుగైన సేవలను అందించేందుకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలను ఆధునీకరిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అం దులో భాగంగానే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం గంటల తరబడి నిరీక్షించే పనిలేకుండా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ (వ్యవసాయేతర రిజిస్ట్రేషన్‌ల) ప్రక్రియ పూర్తయ్యేలా స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకురాబోతున్నామన్నారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు గాను మొదటి దశలో ప్రయోగాత్మకంగా 22 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 10 నుంచి స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి వస్తుందని మంగళవారం ఆయన ఓ ప్రకటనలో ప్రకటించారు.

ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి
హైదరాబాద్‌లోని ఆజంపురా, చిక్కడపల్లి, సంగారెడ్డి జిల్లా సదాశివపేట, మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్, వల్లభ్‌నగర్, రంగారెడ్డి జిల్లా శంషాబాద్, సరూర్‌నగర్, చంపాపేట్, పెద్దపల్లి జిల్లా రామగుండం, ఖమ్మం జిల్లా కూసుమంచి, ఖమ్మం(ఆర్‌ఓ), మేడ్చల్ (ఆర్‌ఓ), మహబూబ్ నగర్ (ఆర్‌ఓ), జగిత్యాల, నిర్మల్, వరంగల్ ఫోర్ట్, వరంగల్ రూరల్, కొత్తగూడెం, ఆర్మూర్, భువనగిరి, చౌటుప్పల్, నాగర్ కర్నూల్ కార్యాలయాల్లో ఈ స్లాట్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఒకే రోజు ఒకే సమయంలో ఎక్కువ దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం సమర్పించడం వల్ల జరిగే జప్యాన్ని నివారించడానికి సబ్-రిజిస్ట్రార్ కార్యాలయ రోజు వారి పని వేళలను 48 స్లాట్లుగా విభజించినట్లు ఆయన చెప్పారు. ప్రజలు నేరుగా (registration. telangana.gov.in) వెబ్-సైట్ ద్వారా తమకు అనుకూలమైన తేదీ, సమయానికి స్లాట్ బుక్ చేసుకుని ఆ రోజు నిర్ధేశించిన సమయానికి వచ్చి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకొని వెంటనే వెళ్లిపోవచ్చని తెలిపారు. స్లాట్ బుక్ చేసుకోని వారి కోసం ఏదైనా అత్యవసర సందర్భాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు, ఐదు వాక్ ఇన్ రిజిస్ట్రేషన్లను అనుమతిస్తారని, నేరుగా కార్యాలయానికి వచ్చిన వారికి ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్దతిలో దస్తావేజులు స్వీకరిస్తారని మంత్రి తెలిపారు.

అదనపు సిబ్బంది నియామకం
పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి, 48 స్లాట్స్ కన్నా ఎక్కువ స్లాట్స్ అవసరం ఉన్న కార్యాలయాల్లో ఇప్పుడున్న సబ్ రిజిస్ట్రార్లకు తోడుగా అదనపు సబ్ రిజిస్ట్రార్లను నియమిస్తామని మంత్రి తెలిపారు. ప్రయోగాత్మకంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని కుత్బుల్లాపూర్ కార్యాలయంలో అదనంగా ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు, సిబ్భందిని నియమించినట్లు ఆయన చెప్పారు.

సొంతంగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రజలు ఇతరులపై ఆధారపడకుండా సొంతంగా దస్తావేజులను తయారు చేసకోవడానికి వెబ్‌సైట్‌లో ఒక మాడ్యూల్‌ను ప్రవేశ పెట్టామని మంత్రి ప్రకటించారు. మొదటగా సేల్ డీడ్ దస్తావేజుల కోసమే ఈ సౌకర్యం ఉంటుందన్నారు. ఇది కూడా ఐచ్చికమేననన్నారు. రిజిస్ట్రేషన్ సమయంలో దస్తావేజు పైన అమ్మినవాళ్లు, కొన్నవాళ్లు, సాక్షులు, సబ్ రిజిస్ట్రార్ వ్యక్తిగతంగా, భౌతికంగా సంతకాలు చేయడానికి చాలా సమయం పట్టడం వల్ల దస్తావేజు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఆలస్యమవుతుందని ఆయన తెలిపారు. దీని వల్ల ప్రజల సమయం వృథా అవడం ద్వారా ఇబ్బందులు పడుతున్నారు. దీనిని నివారించడానికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ ఇ- సంతకం ప్రవేశపెడుతున్నామని ఈ నెల చివరిలోగా దానిని కూడా అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

సెక్షన్ 22కు సవరణ చేస్తూ
సెక్షన్ 22-బి తీసుకొస్తాం
ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఆస్తి డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యిందన్న ఫిర్యాదులు ప్రజల నుంచి ఎక్కువగా వస్తున్నాయని, డబుల్ రిజిస్ట్రేషన్‌లను నివారించడానికి చట్టాన్ని సవరించబోతున్నామని మంత్రి తెలిపారు. డబుల్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించి వివిధ రాష్ట్రాలు ఇప్పటికే చట్టాలను సవరించుకున్నాయని, తెలంగాణలో చట్టసవరణ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని రిజిస్ట్రేషన్ చట్టంలో కొత్తగా సెక్షన్ 22కు సవరణ చేస్తూ సెక్షన్ 22-బి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News