Sunday, February 9, 2025

బిసి రిజర్వేషన్లు ఖరారైతే.. ఇక ‘స్థానిక’ సమరమే

- Advertisement -
- Advertisement -

నోటిఫికేషన్ జారీకి ఎన్నికల
కమిషన్ సిద్ధం మార్చి 5
నుంచి ఇంటర్ పరీక్షలు,
21 నుంచి టెన్త్ పరీక్షలు
పరీక్షలకు ముందు ప్రక్రియ
పూర్తయ్యేనా?
ఆలస్యమైతే ఏప్రిల్‌లోనే ఎన్నికలు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో బిసి రిజర్వేషన్లు ఖరారైన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడనున్నది. బిసి రిజర్వేషన్లకు సంబంధించి ఏర్పాటైన డెడికేటెడ్ కమిషన్ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు సమాచారం. ఆ నివేదికపై చర్చించిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్‌సి, ఎస్‌టి, బిసి రిజర్వేషన్ల కోటానపు రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేయనున్నది. అనంతరం రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికల తేదీలపైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్(ఎస్‌ఇసి)కి ప్రభుత్వం తర నిర్ణయం తెలియజేయనున్నది. అయితే రిజర్వేషన్లు ఖరారు చేసి, ప్రభుత్వ తన నిర్ణయాన్ని తెలియజేసిన వెంటనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చేలా ఎస్‌ఇసి సిద్ధంగా ఉన్నది.

రాష్ట్రంలో మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు, మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకుంటే పరీక్షలకు ముందే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నది. ప్రధానంగా పదో తరగతి పరీక్షలకు దాదాపు అన్ని గ్రామాలలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. కాబట్టి మార్చి రెండో వారం నాటికి ప్రభుత్వ నిర్ణయం వెలువడితే పరీక్షలకు ముందే ఎన్నికలు జరుగనున్నాయి. లేదంటే ఏప్రిల్ 2 తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నది.

కసరత్తు ముమ్మరం న్నికల సంఘం

స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు పది మంది చొప్పున మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్ , స్టేట్ రిసోర్స్ పర్సన్‌లను ఎంపిక చేసింది. ఎంపిటిసి, జెడ్‌పిటిసి, పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్, స్టేట్ రిసోర్స్ పర్సన్‌లకు ఎంసీహెచ్‌ఆర్డీలో ఎన్నికల సంఘం శిక్షణ ఇచ్చింది. మేరకు జిల్లా కలెక్టర్లకు తెలంగాణ ఎలక్షన్ కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. మండల, జిల్లా పరిషత్, పంచాయతీ రిటర్నింగ్ అధికారులను ఫిబ్రవరి 10వ తేదీ లోపు ఎంపిక పూర్తి చేయాలని ఆదేశించింది. పంచాయితీలు, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల కోసం ఎంపిక చేసిన రిటర్నింగ్ అధికారులకు ఫిబ్రవరి 12లోపు శిక్షణ పూర్తి కావాలని తెలిపింది. పోలింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లకు ఈ నెల 15లోపు శిక్షణ పూర్తి చేయాలని సూచించింది. పోలింగ్ సిబ్బందికి మాస్టర్ ఆఫ్ ట్రైనర్స్‌తో శిక్షణ పూర్తి చేయాలని తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.

గ్రామాల్లో ఊరందుకోనున్న రాజకీయం

రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడమే తరువాయి.. ఎన్నికల రంగంలోకి దూకేందుకు స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారు. సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఔత్సాహికులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన వెంటనే గ్రామాల్లో మళ్లీ రాజకీయం ఊపందుకోనుంది. ఒకవైపు ప్రజల్లో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నాయకులు, యువకులు చొరవ చూపుతున్నారు. గ్రామాలలో మహిళా సంఘాలు, స్వయం సహాయక బృందాలు, యువజన సంఘాలతో నిత్యం సమావేశమవుతున్నారు. గ్రామంలో ముఖ్య నాయకులు, పెద్దలను కలుస్తూ వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీకి యువత ఉత్సహం చూపుతోంది. ముఖ్యంగా మొదట జరిగే సర్పంచ్ ఎన్నికలపై ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఆయా పార్టీల్లోని నాయకులు, కార్యకర్తలు, ఏ పార్టీలో సభ్యత్వం లేని వారు కూడా ఆయా పార్టీల మద్దతు కూడగట్టి పోటీచేయాలనే ఆసక్తితో ఉన్నారు.

ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న పార్టీలు

రాబోయే పంచాయతీ ఎన్నికలకు గ్రామస్థాయి నుంచి పార్టీ శ్రేణులను సమాయత్తం చేసేందుకు ఆయా రాజకీయ పార్టీలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితులను సమీక్షించి అన్ని జిల్లాల్లో పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు వ్యూహాలను సిద్దం చేసుకున్నాయి. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపేందుకు జిల్లాలవారీగా ఆయా పార్టీల అగ్రనేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉండే విధంగా ఆయా పార్టీల నేతలు ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. వీటితోపాటు ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్,వాట్సాప్ వంటి సోషల్ మీడియా ద్వారా పార్టీకి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా పార్టీల వ్యవహారాలలో ఇప్పటివరకు కొనసాగుతున్న విధానాలను సమీక్షించుకుని అవసరమైన అంశాలలో కొన్ని మార్పులు చేయనున్నట్లు తెలిసింది.

ప్రధానంగా మూసపద్దతికి స్వస్తి పలికి ఆధునిక విధానాలను అందుబాటులోకి తీసుకువచ్చే విషయంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఆశావహులు స్థానికంగా అందుబాటులో ఉన్న కళాకారులు, పాటల రచయితలతో తమ పేర్లపై పాటలు రాయించుకుంటున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ప్రచార వ్యూహాలపై ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ ముఖ్యనేతలు, మంత్రులలో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, దీపాదాస్ మున్షీ స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం చేశారు.

మంత్రులు జిల్లాల వారీగా బాధ్యత తీసుకుని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పారు. అలాగే సిట్టింగ్ ఎంఎల్‌ఎలు ఉన్నచోట ఒక విధంగా, ప్రతిపక్ష ఎంఎల్‌ఎలు ఉన్నచోట మరో విధమైన వ్యూహాలు అనుసరించి సాధ్యమైనంత ఎక్కువ స్థానాలు గెలవాలని తెలిపారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ అందించిన సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరించాలని సూచించారు. అలాగే బిఆర్‌ఎస్ తమ పార్టీ శ్రేణులను స్థానిక సమరానికి సిద్ధం చేస్తున్నది. ఏడాది కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి ఎక్కువ స్థానాలు గెలిచేందుకు బిఆర్‌ఎస్ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News