Monday, February 10, 2025

ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ… ఇదే.. మోడీ రహస్య ఎజెండా

- Advertisement -
- Advertisement -

దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలి కుటుంబ నియంత్రణను అమలు
చేసినందుకు ఈ రాష్ట్రాలను శిక్షిస్తారా? వ్యతిరేకించకపోతే ఇప్పుడున్న
పార్లమెంట్ స్థానాలకే ఎసరు రాష్ట్రాల హక్కులను హస్తగతం చేసుకునేందుకు
కేంద్రం పావులు యుజిసి నిబంధనలే దానికి ఉదాహరణ తెలంగాణను
ప్రపంచంలోనే అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం తిరువనంతపురంలో
జరిగిన ‘మాతృభూమి’ అంతర్జాతీయ సదస్సులో సిఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు

మన తెలంగాణ / హైదరాబాద్ : ఒకే దేశం.. ఒకే ఎన్నిక నిజానికి ఒకే వ్యక్తి..ఒకే పార్టీ అనే విధానమని..ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రహస్య అజెం డా అదే అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నియోజక వర్గాల పునర్విభజన మరో అంశమని, కుటుంబ నియంత్రణ విధానంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినందుకు దక్షిణాది ని శిక్షిస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు. మలయాళీ దినపత్రిక మాతృభూమి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో సిఎం ప్రసంగించారు. రాజ్యాంగం ప్ర సాదించిన గ్యారంటీలను, మన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలని సిఎం ఆకాంక్షించారు.

తెలంగాణ రైజింగ్ అ నేది నినాదం మాత్రమే కాదని, అది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల స్వప్నమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాల హక్కులను కేంద్రం లాకోవాలని చూస్తోందని, అందుకు ప్రధాన ఉదాహరణ యుజిసిలో సంస్కరణల పేరిట విసిల నియామకాన్ని సిఎం గుర్తుచేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఒక్కతాటిపైకి రాకుంటే ఇప్పుడున్న పార్లమెంట్ స్థానాలు కూడా జనాభా దామాషా ప్రకారం తగ్గే ప్రమాదం ఉందని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు లాంటిదని అన్నారు. తెలంగాణను భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తుమంగా నిలపాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు.

తెలంగాణ రైజింగ్.. విజన్ -2050, దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు కలిసి పనిచేయాలనే దానిపై ముఖ్యమంత్రి ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని, 60 ఏళ్ల కలను నెరవేర్చినందున తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎంతగానో ప్రేమిస్తున్నారన్నారు. గత పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం చేసింది ఏమీ లేదని, ఆ పార్టీ నాయకులు ఎన్నో వాగ్దానాలు చేశారే తప్ప వాటిని నెరవేర్చలేదన్నారు. తెలంగాణ జీడీపీ సుమారు 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉందని, 2035 నాటికి దానిని ఒక ట్రిలియన్ యూఎస్ డాలర్లుగా మార్చాలనుకుంటున్నామని వివరించారు.

మూడు జోన్లుగా తెలంగాణ విభజన

తెలంగాణను హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే మూడు జోన్లుగా విభజించామని, 160 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగు రోడ్డు (ఓఆర్‌ఆర్) పరిధిలోని కోర్ అర్బన్ ఏరియాలో 1.2 కోట్ల ప్రజలు నివసిస్తున్నారన్నారు. ఈ ప్రాంతం సాఫ్ట్ వేర్, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉందని, చార్మినార్, హైదరాబాద్ బిర్యానీ, ముత్యాలకు హైదరాబాద్ ప్రసిద్థి అని చెప్పారు. ఓఆర్‌ఆర్ పరిధిలోని ఈ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెక్టార్స్‌తో 100 శాతం నెట్ జీరోగా మార్పు చేయనున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తాము పలు కార్యక్రమాలు చేపడుతున్నామని, దేశంలోని ముంబాయి, ఢిల్లీ, బెంగుళూరు, చెన్నై వంటి నగరాలతో కాకుండా ప్రపంచంలోని ముఖ్య నగరాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా హైదరాబాద్ ఉండాలనుకుంటున్నామన్నారు.

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని, ఇది భారతదేశంలోని పూర్తి హరిత, పరిశుభ్రమైన, అత్యుత్తమమైన నగరంగా ఉండనుందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. గత యాభై ఏళ్లుగా కాలుష్యం కోరల్లో చిక్కి మూసీ కనుమరుగయ్యే స్థితికి చేరిందని, తమ ప్రభుత్వం మూసీకి పూర్వ వైభవం తీసుకురావాలనుకుంటోందన్నారు. గోదావరి నీటిని మూసీలో కలపడం ద్వారా త్రివేణి సంగమంగా మార్చనున్నామని, అక్కడే 200 ఎకరాల్లో గాంధీ సరోవర్‌ను నిర్మిస్తున్నామన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తీర ప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఈ నేపధ్యంలో తాము డ్రై పోర్ట్ నిర్మించనున్నామని, దానిని ఆంధ్రప్రదేశ్‌లోని సీపోర్ట్ (సముద్ర రేవు)కు ప్రత్యేక రైలు, రోడ్డు మార్గం ద్వారా కలుపుతామని వివరించారు. హైదరాబాద్ వృద్ధి చెందితేనే తెలంగాణ రైజింగ్ సాధ్యమవుతుందని, అభివృద్ధి మొదట నగరాలతోనే మొదలవుతుందనేది తన భావన అని, హైదరాబాద్ రైజింగ్ కావాలంటే అది వేగవంతమైన, పరిశుభ్రమైన, సుక్షితమైన అవకాశాలు కల్పించే నగరంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.

తాము రీజనల్ రింగు రోడ్డును, రైల్వే లైను నిర్మించబోతున్నామని, ఈ రెండింటిని రేడియల్ రోడ్ల ద్వారా కలపనున్నట్లు వివరించారు. తాము ఇటీవల ఎనర్జీ పాలసీని విడుదల చేశామని, ఈవీలపై ఉన్న అన్ని పన్నులను తొలగించామని, ఈవీల అమ్మకాల్లో తెలంగాణ దేశంలోనే తొలి స్థానంలో ఉందని, రాష్ట్రంలోని మూడు వేల ఆర్టీసీ బస్సులను దశలవారీగా ఈవీలుగా మార్చనున్నట్లు చెప్పారు. ఓఆర్‌ఆర్- ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ఉన్న సెమీ అర్బన్ ఏరియాను ఉత్పత్తి (మాన్యుఫ్యాక్చ్రింగ్) జోన్‌గా మార్చబోతున్నామని, ఇది చైనా+1 అనే తమ వ్యూహానికి ప్రపంచానికి సమాధానంగా నిలవనుందని అన్నారు.

తెలంగాణ లాజిస్టిక్ సెంటర్‌గా ఉండాలి

ఔషధాలు, విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ ముందు వరుసలో ఉందని, వాటికి అదనంగా ఎఫ్‌ఎంసీజీ, రక్షణ రాకెట్స్, స్పేస్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ముందు వరుసలో నిలవాలనుకుంటున్నామన్నారు. భారతదేశానికి డాటా సెంటర్ హబ్‌గా, పంప్ స్టోరేజీ హబ్‌గా తెలంగాణ నిలవనుందని తెలిపారు. దేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర దిక్కులకు అనుసంధానమై, దక్షిణాది రాష్ట్రాలకు ముఖ ద్వారంగా ఉన్న తెలంగాణ దేశానికి లాజిస్టిక్ సెంటర్‌గా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నామన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ వెలుపల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న గ్రామాలను మార్చాలనుకుంటున్నామని, గ్రామాల్లోనూ అత్యుత్తమ వసతులు కల్పిస్తామన్నారు.

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం

సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ విధానం అని, దళితులు, ఓబీసీలు, గిరిజనులు, మైనారిటీలకు సామాజిక న్యాయం చేస్తామని తమ నాయకులు రాహుల్ గాంధీ అభయమిచ్చారని చెప్పారు. సమగ్ర కుల సర్వే చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, దానిని అసెంబ్లీలోనూ ప్రవేశపెట్టామని, జనాభా దామాషా ప్రాతిపదికన తాము వనరులు సమకూర్చుతామన్నారు. వర్గీకరణ కోసం 30ఏళ్లుగా మాదిగ సోదరులు పోరాడుతున్నారని, వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తరువాత వర్గీకరణ చేపట్టాలని తాము ఫిబ్రవరి 4న నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రత్యేక శాసనసభ సమావేశం ఏర్పాటు చేసి దాని అమలుకు తీర్మానం చేశామని, ఫిబ్రవరి 4న ఇక నుంచి తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవంగా జరపుకోనున్నట్లు సీఎం తెలిపారు. సుపరిపాలన ఏడాదిలోనే ఎంత మార్పు తెస్తుందనేందుకు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఉదాహరణ అని అభివర్ణించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News