కాళేశ్వరంపై ఆగమేఘాలపై స్పందించిన
కేంద్రం సుంకిశాల, ఎస్ఎల్బిసిపై
ఏం చేస్తోంది? అమృత్లో అవినీతిపై
ఆధారాలు ఇచ్చినా ఉలుకూ పలుకూ
లేదు సరైన సమయంలో సిఎం
రేవంత్ బిజెపిలో చేరతారు: కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ఢిల్లీలోని బిజెపి ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి రక్షణ కవచంగా నిలబడుతుందని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. సిఎం రేవంత్ రెడ్డిని, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బిజెపి ఎందుకు కాపాడుతుందో అన్న అంశం మిలియన్ డాలర్ ప్రశ్నగా మారిందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సరైన సమయంలో బిజెపిలో చేరుతానని హామీ ఇచ్చి లోపాయికారి ఒప్పందం చేసుకోవడం వల్లనే తెలంగాణ కేంద్ర మంత్రులతో సహా మొత్తం బిజెపి నాయకులు రేవంత్ రెడ్డిని కాపాడుతూ రక్షణ కవచంగా నిలుస్తున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఢిల్లీలో కొట్లాడుతూ తెలంగాణలో మాత్రం బిజెపి ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అన్ని రకాల రక్షణలను కల్పిస్తూ కాపుకాస్తుందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
దాదాపు 15 నెలల కాలంలో ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రి అనేక స్కామ్లకు పాల్పడుతున్నా, కేంద్ర ప్రభుత్వం కనీసం ఇప్పటిదాకా స్పందించలేదని అన్నారు. ఒకప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రమాదంపైన ఆగమేఘాల మీద స్పందించి కేంద్ర ప్రభుత్వ సంస్థలను రంగంలోకి దించి, విచారణల పేరుతో వేధింపులకు పాల్పడిన బిజెపి ప్రభుత్వం ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో సుంకిశాల ప్రాజెక్టులో రిటైనింగ్ వాల్ కూలిన ప్రమాదంతో పాటు తాజాగా ఎస్ఎల్బిసి సొరంగంలో జరిగిన పెను ప్రమాదాలపైన కనీసం స్పందించడం లేదని చెప్పారు. గతంలో ఎన్డిఎస్ఎ, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలు కేంద్రం ఆదేశాల మేరకు స్పందించిన విధంగానే కనీసం జరిగిన ప్రమాదాలపైన విచారణ చేసి, కారణాలు కనుక్కొని ప్రజలకి వివరిస్తాయా..లేదా..?.. ఎప్పటిలాగానే ఇక్కడి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తాయా..? అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
సాక్ష్యాదారాలతో ఫిర్యాదు చేసినా కేంద్రం మౌనం వహిస్తున్నది
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ బిజెపిపైన విమర్శలు చేస్తూ పోరాటం చేస్తున్నానని చెప్పుకొని తిరుగుతుంటే, ఆశ్చర్యంగా ఇక్కడ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్, బిజెపి పార్టీలు కలిసి పనిచేస్తున్న విషయం అనేకసార్లు స్పష్టమైందని కెటిఆర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం యొక్క 1337 కోట్ల కేంద్ర పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ నిధులను రేవంత్ రెడ్డి తన సొంత బావమరిదికి అప్పనంగా కట్టబెట్టి, అమృత్ పథకంలో చేసిన స్కాం తాలూకు పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి స్వయంగా వెళ్లి అందజేశామని, అయితే సాక్ష్యాలు అందించినా.. ఇప్పటిదాకా కనీసం కేంద్రం స్పందించకుండా రేవంత్ రెడ్డిని కాపాడుతుందని ఆరోపించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ నిర్మాణరంగ సంస్థల నుంచి చదరపు అడుగుకి 150 రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఆర్ఆర్ టాక్స్ పేరిట పన్నును వసూలు చేస్తుందని చెప్పిన అంశం పైన ఇప్పటిదాకా బిజెపి ఒక్క మాట కూడా మాట్లాడలేదు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రి పొంగులేటిపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు చేసి, భారీగా నగదుతో పాటు ఆస్తులను గుర్తించినట్లుగా వార్తలు వచ్చి ఐదు నెలలు దాటిన ఇప్పటిదాకా కనీసం ప్రకటన కూడా చేయలేదు అన్నారు. తాను చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అవినీతి పైన, అరాచకాల పైన వెంటనే స్పందించి తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.