హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొమ్మిది పేజీల లేఖ రాశారు. రాష్ట్రానికి నిధులు మంజూరు చేయించడం కిషన్రెడ్డి నైతిక బాధ్యత అని లేఖలో ఆయన పేర్కొన్నారు. కిషన్రెడ్డి కేంద్రమంత్రిగా ఉండగానే చెన్నై, బెంగళూరు మెట్రో విస్తరణకు ఆమోదముద్ర లభించిందని కానీ, హైదరాబాద్ మెట్రో విస్తరణపై తాను పలుమార్లు విజ్ఞప్తి చేసినా పురోగతి లేదని తెలిపారు. సబర్మతి, గంగా పునరుజ్జీవనంపై పలుమార్లు ప్రకటన చేసిన కిషన్ రెడ్డి మూసి పునరుజ్జీవనంపై ఎందుకు విషం చిమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రాజెక్టుల అంశంలో కిషన్రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అని అన్నారు. తనది అవగాహనరాహిత్యమని కిషన్రెడ్డి అనడంపై సిఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి ఉన్న కిషన్రెడ్డి తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని సవాలు విసిరారు. తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఎదురుదాడి చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కిషన్రెడ్డిని విజ్ఞప్తి చేస్తున్నట్లు సిఎం పేర్కొన్నారు.