న్యూఢిల్లీ : ఆర్జీకర్ ఆస్పత్రి వైద్యురాలిపై గత ఏడాది జరిగిన హత్యాచారం సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మళ్లీ సిబీఐ విచారణ జరిపించాలని మృతురాలి తల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీం కోర్టు తాజాగా ఆ పిటిషన్ను కొట్టివేసింది. కోల్కతా హైకోర్టులో ఈ పిటిషన్ను కొనసాగించవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా సూచించారు. గత ఏడాది ఆగస్టు 9 వ తేదీ రాత్రి ఆర్జీకర్ ఆస్పత్రి సెమినార్ రూమ్లో ఒంటరిగా నిద్రిస్తున్న జూనియర్ వైద్యురాలిపై జరిగిన హత్యాచారం సంఘటన ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి ఆస్పత్రి ఆవరణ లోని సీసీటీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా సంజయ్రాయ్ను పోలీసులు అరెస్టు చేశారు.
సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడిని దోషిగా తేల్చింది. శిక్ష ఖరారు చేయడానికి ముందు … తాను ఏ నేరం చేయలేదని ఏ కారణం లేకుండానే తనను ఇందులో ఇరికించారని సంజయ్ తన వాదనలు వినిపించాడు. అయితే ఈ కేసులో కోర్టు అతడికి జీవిత ఖైదును విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇదిలా ఉంటే సంజయ్రాయ్కు జీవితఖైదు విధించిన ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఇప్పటికే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కలకత్తా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం చేసిన ఈ ప్రత్యేక అప్పీల్ను స్వీకరించేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే ఇదే తీర్పును సవాలు చేస్తూ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన అప్పీలును న్యాయస్థానం అంగీకరించింది. మరోవైపు కేసు పునర్విచారణ కోరుతూ మృతురాలి తల్లిదండ్రులు వేసిన పిటిషన్ అత్యవసర విచారణకు ఇప్పటికే నిరాకరించిన సుప్రీం కోర్టు తాజాగా హైకోర్టుకు వెళ్లాలని సూచించింది.