మనతెలంగాణ/ఇల్లంతకుంట : ఆరుగాలం కష్టించి పండించిన వరిధాన్యాన్ని అమ్ముకుందామంటే తాలు పేరుతో రైస్ మిల్లర్లు మోసం చేస్తున్నారని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలోని ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్లో రైతులు సెల్ టవర్ ఎక్కారు. గ్రామానికి చెందిన రైతు పసుల వెంకటి ముందుగా సెల్ టవర్ ఎక్కి తన నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయనకు మద్దతుగా గ్రామానికి చెందిన రైతులు కేతిరెడ్డి రాంరెడ్డి, తుముల దేవయ్య, దండవేని రజినికాంత్, ల్యాగల సంపత్, కొరెంభూమయ్య, ఎద్దు నాగరాజు, బండారి నారాయణ లు సెల్ టవర్ ఎక్కారు. వెంటనే కలెక్టర్ వచ్చి తమకు తాలు తీయమని హామీ ఇవ్వాలని , లేదంటే కిందకు దిగేది లేదని వారు తెల్చిచెప్పారు. ఈ విషయం తెలుసుకున్న సర్పంచ్ గోడిశేల జితేందర్గౌడ్, ఎంపిటిసి కరివేద స్వప్న కర్ణాకర్రెడ్డిలు జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటుగా సోసైటీ చైర్మన్ రోండ్ల తిరుపతిరెడ్డికి సమాచారం అందజేశారు. వెంటనే డిఎస్ఒ జితేందర్రెడ్డి, సోసైటి చైర్మన్ రైతుల వద్దకు చేరుకున్నారు. బస్తాకు 42.50కేజీల ధాన్యం తూకం వేయాలని, అంతకంటే ఎక్కువగా వేస్తే మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రైతులు సెల్ టవర్ కిందికి దిగొచ్చారు.