భూములు కోల్పోతున్న బాధితుల ధర్నా
మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్
మనతెలంగాణ/హైదరాబాద్ : బంజారాహిల్స్లో ఆర్ఆర్ఆర్ బాధితులు ఆందోళనకు దిగారు. భూములు కోల్పోతున్న తమకు న్యాయం చేయాలంటూ బంజారాహిల్స్ రోడ్ నెం 2లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) రీజనల్ ఆఫీస్ ఎదుట ధర్నా కు దిగారు. చౌటుప్పల్, భువనగిరి, గజ్వేల్ ప్రాంతాల నుంచి ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు వచ్చారు. మార్కెట్ విలువ రూ.5 కోట్లకు పైగా ఉంటే ప్రభుత్వం రూ.20 లక్షలు మాత్రమే చెల్లిస్తోందని, తమ భూములకు మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని ఆర్ఆర్ఆర్ బాధితులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా త్రిబుల్ ఆర్ భూనిర్వాసిత ఐక్యవేదిక కన్వీనర్ చింతల దామోదర్రెడ్డి మాట్లాడుతూ మూడేళ్ల నుంచి న్యాయం చేయాలని అన్ని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మున్సిపాలిటీల మధ్య లో నుంచి కాకుండా ఆర్ఆర్ఆర్ అలైన్ మెంట్ మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. వరంగల్ హైవే కోసం, కాళేశ్వరం కాలువల నిర్మాణానికి, ఎలక్ట్రిసిటీ హైటెన్షన్ టవర్స్ కోసం, యాదగిరిగుట్ట రోడ్డు డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం ఇప్పటికే తమ భూములు తీసుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నార్త్ అలైన్మెంట్ను ఓఆర్ఆర్ నుంచి 28 కిలోమీటర్లకు బదులుగా 40 కిలోమీటర్లకు మారుస్తూ శాస్త్రీయంగా కొత్త డిపిఆర్ను త యారు చేసి కేంద్రానికి పంపించాలని ఆయన పేర్కొన్నా రు. ధర్నా అనంతరం ఎన్హెచ్ఏఐ రీజనల్ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు దూడల భిక్షంగౌడ్, బిజెపి జిల్లా నాయకులు గుజ్జుల సురేందర్రెడ్డి, మారుపాల లింగం గౌడ్, జాల వెంకటేశం యాదవ్లతో పాటు సుమారుగా వందమంది బాధితులు ఈ ధర్నాలో పాల్గొన్నారు.