Wednesday, July 3, 2024

భాగవత్ మరోటి చేయగలరా?

- Advertisement -
- Advertisement -

బిజెపి జాతీయ నాయకులైన వాజ్‌పేయీ, అద్వానీ తదితరులను సైతం లెక్కించే వారు కాదు. పూర్తిగా తన బలాన్ని, యుక్తులను నమ్ముకున్నవాడు. కాలం కలిసి వచ్చి అవన్నీ చెల్లుబాటు అయ్యాయి కూడా. ప్రధాని అయినాక పరిస్థితి గురించి చెప్పనక్కర లేదు. ఈ విధమైన సుదీర్ఘ నేపథ్యం దృష్టా ఇప్పుడాయన ప్రస్తుత ఫలితాలను గురించి గాని, భాగవత్ వ్యాఖ్యల గురించి గాని పట్టించుకోనక్కర లేదని భావిస్తుండవచ్చునా? దానితో పాటు, ఏవైనా సర్దుబాటు అవసరమనుకుంటే అవి తనంతట తానే చేసుకుని తిరిగి పుంజుకోగలరని నమ్ముతుండవచ్చునా? సర్దుబాట్లు అవసరమని భావిస్తే దానిని పైకి చూపకుండా, ఎన్నికల ఎదురు దెబ్బల వల్లనో, భాగవత్ విమర్శల కారణంగానో ఆ పని చేస్తున్నట్లు కనిపించకుండా, మౌనంగా తన పద్ధతిలో తాను క్రమంగా చేయవచ్చునా?

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు జూన్ 4న, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రచారపు తీరుపై ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు 10న వెలువడిన దరిమిలా కలిగే ప్రభావాలు ఏమిటని ఇప్పటి వరకు ఎదురు చూసిన వారికి కేవలం నిరాశ కలుగుతున్నది. ఫలితాల రోజున, భాగవత్ ప్రసంగం రోజున చాలా మంది చాలా కాకపోయినా ఎంతో కొంత ఆశించారు. కాని జూన్ నెల ముగుస్తున్న సమయానికి ఎవరు ఆశించిన మార్పు ఏమీ కనిపించడం లేదు.ఎన్నికలలో మోడీకి కోరుకున్న ఫలితాలు రానట్లు అందరూ గుర్తించిందే. పార్టీ సీట్లు పెరగలేదు సరికదా పోయిన మారుకన్న తగ్గి, స్వంత మెజారిటీ కూడా కోల్పోయింది.

ఎన్‌డిఎ పరిస్థితి సైతం అంతే అయింది. అధికారానికి వచ్చేందుకు మోడీకి మొదటి సారి కూటమి బలం తప్పలేదు. ప్రజలలో మద్దతు కోల్పోవడం అందుకు కారణమని తెలుసుకోలేనివాడు కాదాయన. అట్లా మద్దతు ఎందుకు తగ్గిందనేది కూడా గ్రహించలేనివాడు కాదు. అటువంటప్పుడు ఎవరైనా ఏమని భావిస్తారు. ఆ ఎదురు దెబ్బల నుంచి పాఠాలు నేర్చుకుని తన పద్ధతులలో తగు మార్పులు చేసుకోగలరని, పరిపాలనలో వ్యక్తిగత శైలిలో, రాజకీయ ధోరణిలో, ఫలితాలు వెలువడినప్పటి నుంచి మూడు వారాలకు పైగా గడిచిపోయాయి. మరి ఇంత కాలంలో ఏ విషయంలోనైనా, ఏ మాత్రమైనా మార్పు కనిపించిందా?

భాగవత్ విషయం చూద్దాము. ఆయన నాగపూర్‌లోని తమ సంస్థ ప్రధాన కార్యాలయంలో మోడీ గురించి, బిజెపి గురించి చేసిన బహిరంగ వ్యాఖ్యలు దేశ విదేశాలలో పెద్ద సంచలనం సృష్టించాయి. మోడీపై ఆ సంస్థ అధినేతలు ఆయన 2001 14 మధ్య ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు గాని, 2014 నుంచి దేశ ప్రధాన మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు గాని ఈ విధమైన కఠిన వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. మొన్నటి వలే బహిరంగంగా అంతకన్న చేయలేదు. అందువల్లనే అవి అంత సంచలనమయ్యాయి. పరివార్ వర్గాలలో కలవరం సృష్టించాయి. వ్యక్తిగతంగా మోడీ నుంచి బయటకు స్పందనలైతే ఏవీ లేవుగాని, అవి ఆయనను తప్పక వత్తిడికి గురి చేసి ఉంటాయి. భాగవత్ వ్యాఖ్యల వాస్తవ ప్రభావం ఏదైనా ఉందా? అందువల్ల మోడీలో మార్పులు ఏవైనా ఉన్నాయా? అన్నవి అసలు ప్రశ్నలు. కాని ఇంత వరకు ఏ మార్పులూ వెల్లడి కావడం లేదు.

చివరకు తేలుతున్నదేమంటే, మోడీపై ఎన్నికల ఎదురు దెబ్బల ప్రభావం లేదు. సంఘ్ పరివార్ అధినేత బహిరంగ విమర్శల ప్రభావమూ లేదు. అంతేకాదు, ఆయన లోలోపల ఏమి ఆలోచిస్తున్నారో తెలియదు గాని, బయటకు మాత్రం ఏమీ జరగనట్లు అంతా షరా మామూలుగా తన వెనుకటి ధోరణిలోనే వ్యవహరిస్తున్నారు. అందుకు కారణం ఏమై ఉండవచ్చు? మోడీకి గుజరాత్ రోజుల నుంచి కూడా ఒంటరి పోకడలు వ్యక్తి అని, అహంకారి అని, సంఘ్ పరివార్‌ను సైతం లెక్క చేయరని పేరున్నది.బిజెపి జాతీయ నాయకులైన వాజ్‌పేయీ, అద్వానీ తదితరులను సైతం లెక్కించే వారు కాదు. పూర్తిగా తన బలాన్ని, యుక్తులను నమ్ముకున్నవాడు. కాలం కలిసి వచ్చి అవన్నీ చెల్లుబాటు అయ్యాయి కూడా. ప్రధాని అయినాక పరిస్థితి గురించి చెప్పనక్కర లేదు.

ఈ విధమైన సుదీర్ఘ నేపథ్యం దృష్టా ఇప్పుడాయన ప్రస్తుత ఫలితాలను గురించి గాని, భాగవత్ వ్యాఖ్యల గురించి గాని పట్టించుకోనక్కర లేదని భావిస్తుండవచ్చునా? దానితో పాటు, ఏవైనా సర్దుబాటు అవసరమనుకుంటే అవి తనంతట తానే చేసుకుని తిరిగి పుంజుకోగలరని నమ్ముతుండవచ్చునా? సర్దుబాట్లు అవసరమని భావిస్తే దానిని పైకి చూపకుండా, ఎన్నికల ఎదురు దెబ్బల వల్లనో, భాగవత్ విమర్శల కారణంగానో ఆ పని చేస్తున్నట్లు కనిపించకుండా, మౌనంగా తన పద్ధతిలో తాను క్రమంగా చేయవచ్చునా? ఏదైనా సాధ్యమే. మరి కొంత కాలం పాటు జాగ్రత్తగా గమనిస్తే గాని ఈ ప్రశ్నలపై స్పష్టత రాదు.
ప్రస్తుతానికి మనకు కనిపిస్తున్నంత వరకు మాత్రం ప్రధాని మోడీపై ఎన్నికల ఫలితాల, భాగవత్ ప్రసంగం ఎటువంటి ప్రభావాలు చూపడం లేదు. ఇందువల్ల రాగల కాలంలో ఆయనపై రాజకీయ ప్రభావాలు ఏ విధంగా ఉండవచ్చు? తన పరిపాలనలు, ధోరణుల ప్రభావం ప్రజలపై ఏ విధంగా పడవచ్చు? అన్నవి రెండు ప్రశ్నలు.

అందువల్ల సాధారణ రూపంలో ప్రజలకు సంబంధించి ఏమి జరగవచ్చుననేది సరేసరి కాగా, ముఖ్యంగా ఇదే 2024తో పాటు రాగల రెండు సంవత్సరాలలో కలిపి సుమారు పది అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలలో ఏమి జరగవచ్చుననేది కీలకం కానున్నది. ఆ అసెంబ్లీలు ఉత్తరాన, దక్షిణాన, పశ్చిమాన, తూర్పున దేశమంతటా విస్తరించి ఉన్నాయి. ఈ విధంగా మోడీ తో పాటు బిజెపికి, కనీసం పరోక్షంగానైనా సంఘ్ పరివార్‌కు మహా కీలకం అవుతాయి. ఆ తర్వాత మరి రెండున్నర సంవత్సరాలకు తిరిగి లోక్‌సభ ఎన్నికలు జరుగుతాయన్నది గుర్తించాలి. వీటన్నింటి దృష్టా, మోడీ వ్యవహరణ ఏ విధంగా ఉండగలదు? తనలో ఏవైనా మార్పులు వస్తాయా రావా అన్నది ప్రశ్న. మోడీకి ఏమైనా జరగవచ్చు, జరగకపోవచ్చు. ఆయన 2029 తర్వాత ఉండవచ్చు, ఉండకపోవచ్చు.

పది అసెంబ్లీలలో తీవ్ర పరాజయాలు ఎదురైతే పార్టీ భవిష్యత్తు దృష్టా తను స్వయంగా తప్పుకోవచ్చు లేదా ఆర్‌ఎస్‌ఎస్ తప్పించవచ్చు. ఈ సాధ్యాసాధ్యాలపై ఇపుడు ఊహాగానాలు ఎన్నయినా చేయచ్చు గాని అదొక వృథా ప్రయాస. కనుక ఆ విషయం వదలివేస్తే, జూన్ 10న ఒక విధంగా సాహసించి ఆ విధమైన బహిరంగ విమర్శలు చేసిన సర్ సంఘ్ చాలక్, ఈ లోపల తమ వైపు నుంచి ఏమైనా దిద్దుబాటు చర్యలు చేపట్టవచ్చునా? ఎందుకంటే, మోడీ తాత్కాలికం, సంఘ్ పరివార్ శాశ్వతం. మోడీ సిద్ధాంతం, లక్షం తన వ్యక్తిగత అధికారం కావచ్చు. కాని పరివార్ సిద్ధాంతం, లక్షం వేరే ఉన్నాయి. అవేమిటో అందరికీ తెలిసినవే. వాటితో మనం ఏకీభవిస్తాయా లేదా అన్నది వేరే చర్చ. కాని ప్రస్తుతం మన ముందుకు వచ్చిన ప్రశ్నలను బట్టి, మోడీని పక్కన ఉంచుతూ తమ దీర్ఘకాలిక లక్షాల విషయమై సంఘ్ పెద్దలు ఆలోచించవలసి ఉంటుంది.

ఎన్నికల ఫలితాలు, మోడీ తీరుతెన్నులను బట్టి వారు ఈ ఆలోచనలు ఇప్పటికే మొదలు పెట్టినట్లు భావిస్తే పొరపాటు ఉండకపోవచ్చు. ఆ పని జరుగుతుండకపోతే అంతటి సంస్థ, ఇటువంటి విషయమై, తమ ప్రధాని గురించి బహిరంగంగా ఆ విధమైన విమర్శలు చేయగల అవకాశం ఎంత మాత్రం ఉండదు. అది కూడా 2001 నుంచి ఇంత కాలం తర్వాత మొదటి సారిగా. కనుక, వారి దిద్దుబాటు ఆలోచనలేమిటన్నది మనకు మునుముందు గాని తెలిసి రాదు. అది కూడా కొంత వరకు మోడీ తనంతట తాను చేసుకోగల దిద్దుబాట్లు అంటూ ఏమైనా ఉంటే వాటిపై కూడా ఆధారపడి ఉండవచ్చు. అయితే, అదంతా అట్లుంచి సంఘ్ నాయకత్వం తనంతట తాను కొన్ని చర్యలు తీసుకోవడం అవసరం కావచ్చు. అవి, మోడీపై సమీక్షలకు, అవసరమైన కట్టడులకు స్పష్టమైన నిర్ణయం తీసుకోవటం. ఆ విషయం మోడీకి, పార్టీ అధ్యక్షునికి, ఇతర ముఖ్యులకు తెలియపరచటం. లోగడ వాజ్‌పేయీ, అద్వానీలతో తరచు సమీక్షా సమావేశాలు నిర్వహించి తగు సూచనలు చేసినట్లు మోడీ, అమిత్ షాలకు, పార్టీ అధ్యక్షులకు అదే విధమైన నియంత్రణ ఏర్పాటు చేయటం. ఇదంతా జరుగుతున్నట్లు సంఘ్ పరివార్‌లోని అన్ని సంస్థలతో పాటు కార్యకర్తల వరకు అన్ని దశలలోని వారికి సూచనలు అందేట్లు చూడటం. ఇటువంటివి మోహన్ భాగవత్ తమ జూన్ 10 వ్యాఖ్యలకు తదనంతర చర్యలుగా చేయగలరా?

టంకశాల అశోక్
9848191767

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News