Saturday, September 28, 2024

ఉక్రెయిన్ మెడికల్ సెంటర్‌పై రష్యాదాడి.. 8 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఈశాన్య ఉక్రెయిన్ నగరం సుమీలో మెడికల్ సెంటర్‌పై శనివారం ఉదయం రష్యా వరుసగా రెండుసార్లు జరిపిన దాడుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. రష్యా కుర్స్ రీజియన్‌లో 32 కిమీ దూరంలో సుమీ నగరం ఉంది. రష్యా మిలిటరీ దృష్టి మళ్లించడానికి ఆగస్టు 6 నుంచి ఉక్రెయిన్ దళాలు అక్కడ మాటు వేసి ఉంటున్నాయి. రష్యా మొదటి దాడిలో ఒకరు చనిపోగా, ఆ సెంటర్ లోని రోగులను, సిబ్బందిని ఖాళీ చేయించిన తరువాత రెండో దాడి జరిగిందని ఉక్రెయిన్ హోం మంత్రి ఐహోర్ క్లిమెంకో వెల్లడించారు. ఈ దాడుల్లో సాహేద్ డ్రోన్లను రష్యా వినియోగించిందని సుమీ సిటీ మిలిటరీ అధికార యంత్రాంగం అధినేత ఒలెక్సీ డ్రోజ్‌డెంకో వెల్లడించారు.

ఈ దాడుల్లో మరో 11 మంది గాయపడ్డారని చెప్పారు. గత రాత్రి రష్యా ప్రయోగించిన 73 డ్రోన్లలో 69ని కూల్చివేసినట్టు ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ పేర్కొంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్వస్థలం క్రివ్‌రిహ్ నగరంలో రష్యా డ్రోన్ దాడికి శిథిలమైన అధికార భవనం శిథిలాల కింద ఒక మృతదేహాన్ని కనుగొన్నామని స్థానిక అధికారులు శనివారం వెల్లడించారు. దీంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరిందని చెప్పారు. గత రాత్రి బెల్గొరోడ్ రీజియన్‌పై దాడి చేసిన నాలుగు ఉక్రెయిన్ డ్రోన్లను రష్యా ఎయిర్‌డిఫెన్స్ కూల్చివేసిందని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ శనివారం వెల్లడించింది. రష్యా సరిహద్దు నగరం షెబెకినో పై ఉక్రెయిన్ దాడికి ఒకరు మృతి చెందారని బెల్గోరోడ్ రీజినల్ గవర్నర్ వ్యాచేస్టవ్ గ్లాడ్‌కోవ్ చెప్పారు. మరో ఇద్దరు గాయపడ్డారని తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News