ముంబై: భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) వార్షిక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం కనుల పండవగా జరిగింది. ముంబైలో జరిగిన కార్యక్రమంలో వివిధ విభాగాల్లో ఉత్తమంగా రాణించిన క్రికెటర్లకు పురస్కారాలు అందజేశారు. భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్, బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్కు ప్రతిష్ఠాత్మకమైన కల్నల్ సికె నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ పురస్కారం లభించింది. భారత క్రికెట్కు సచిన్ అందించినసేవలకు గుర్తింపుగా ఈ గౌరవం లభించింది. ఐసిసి చీఫ్ జైషా చేతుల మీదుగా సచిన్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పాలి ఉమ్రిగర్ పురస్కారం భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు లభించింది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన బుమ్రాకు ఉమ్రిగర్ అవార్డు దక్కింది. ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్ అవార్డును టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన నిలిచింది. 2024 సంవత్సరంలో మంధాన అసాధారణ బ్యాటింగ్తో అలరించిన సంగతి తెలిసిందే.
ఇక ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం క్రికెటర్ అవార్డు (పురుషుల) విభాగంలో యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్దక్కించుకున్నాడు. మహిళల విభాగంలో ఈ అవార్డు ఆశా శోభనకు లభించింది. బిసిసిఐ ప్రతేక అవార్డును రవిచంద్రన్ అశ్విన్ దక్కించుకున్నాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్గా మంధాన నిలిచింది. వన్డేల్లో అత్యధిక వికెట్లను పడగొట్టిన విమెన్స్ క్రికెటర్ అవార్డును దీప్తి శర్మ దక్కించుకుంది. రంజీ ట్రోఫీ ప్లేట్ విభాగంలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా మోహిత్ జాంగ్ర, అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా అగ్ని చోప్రాలు మాధవ్రావ్ సింధియా అవార్డును అందుకున్నారు. ఎలైట్ గ్రూప్ విభాగంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్గా రికీ భూయ్, అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రికెటర్గా తనయ్ త్యాగరాజన్ నిలిచారు. వీరికి కూడా మాధర్రావ్ సింధియా ఉత్తమ క్రికెటర్ అవార్డులు లభించాయి. ఇక బెస్ట్ పెర్ఫామెన్స్ ఇన్ బిసిసిఐ డొమెస్టిక్ క్రికెట్ టోర్మమెంట్ పురస్కారాన్ని ముంబై టీమ్ సొంతం చేసుకుంది. లాలా అమర్నాథ్ బెస్ట్ ఆల్రౌండర్ (రంజీ ట్రోఫీ) అవార్డును తనుశ్ కోటియన్ దక్కించుకున్నాడు.