Tuesday, September 17, 2024

ఎండమావుల వర్గీకరణ ఇంకెంత దూరం!

- Advertisement -
- Advertisement -

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి రిజర్వేషన్లలో మాదిగలకు తీవ్రమైన అన్యాయం జరుగుతున్నదని మాజీ నక్సలైట్ కిషన్ ఎలియాస్ మందా ఎలియా నేతృత్వంలో ఎంఆర్‌పిఎస్ ఏర్పడి కాస్త మంద కృష్ణమాదిగగా నామాంతరం చెంది ఆయన నేతృత్వంలో వర్గీకరణ ఉద్యమం పురుడుపోసుకుంది. ఆనాటి టిడిపి ప్రభుత్వం తమ అండదండలు పుష్కలంగా అందించి వర్గీకరణ చేసింది. వర్గీకరణను సుప్రీం కోర్టు కొట్టివేసినప్పటికీ 20 సంవత్సరాల అనంతరం కూడా ఎన్నికలు రాగానే ఇది ఒక అంశంగా తెరపైకి వస్తున్నది. తెలంగాణ మలిదశ ఉద్యమం ఉధృతమై అనేక ప్రజాఉద్యమాలు కనుమరుగైనట్లుగానే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే, తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ ఫలాలు మాదిగలే ఎక్కువ పొంది, వర్గీకరణ ఉద్యమానికి ఉనికి ఉండదని చాలా మంది భావించారు. ఉషా మెహ్రా కమిషన్ తిరస్కరించి, సుప్రీంకోర్టు కొట్టివేసి, పార్లమెంటులో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర సామాజిక న్యాయసాధికారిక మంత్రిత్వశాఖ ఎస్‌సి రిజర్వేషన్ల వర్గీకరణ సాధ్యం కాదని పలుమార్లు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చింది. కేంద్ర ఎస్‌సి కమిషన్, ఎస్‌సి కులాల్లో ఏదైనా కులం వెనుకబడినట్లు గుర్తించినచో ఆ కులం అభ్యున్నతికోసం ప్రత్యేక పథకం ప్రవేశపెట్టాలి. కానీ ఎస్‌సి రిజర్వేషన్లను విభజించరాదు అని కేంద్రానికి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

తెలంగాణలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 125 ప్రజాప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్ 153ఎ ప్రకారం ఎన్నికల సమయంలో ఒక వర్గానికి గాని, సమూహానికి గాని వ్యతిరేకంగా లేదా అనుకూలంగా సభలు సమావేశాలు నిర్వహించం లేదా అలాంటి వాటిలో పాల్గొనడం నేరమని తెలిసి కూడా, దేశ ప్రధానమంత్రే స్వయం గా మాదిగల ఓట్ల కోసం బిజెపి ఎంఆర్‌పిఎస్ ముసుగులో 2023 నవంబర్11న నిర్వ హించిన విశ్వరూప మహాసభకు హాజరుకావడం వర్గీకరణ అంశంపై ఒక కమిటీ వేస్తామని ప్రకటించడం, లా మేకర్స్ లా బ్రేకర్స్ అయితే ఒక్క వర్గీకరణనే ఏంఏదైనా చేయగలుగుతామనే సంకేతం ఇవ్వడానికే అనుకోవడంలో అతియోశక్తిలేదు అన్నట్లుగానే కేంద్రంలో ఉన్నతస్థాయి కమిటీ జనవరి 19న వేయడం చకచక జరిగినవి. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అధ్యక్షతన హోం, న్యాయ, గిరిజన, డిఒపిటి, సామాజిక న్యాయశాఖల కార్యదర్శులతో కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ రిపోర్ట్ ఏమిస్తాది అనే దానికన్నా సుప్రీం కోర్టు తీర్పు ఎలా రానున్నది అనే దానిపైననే వర్గీకరరణ అంశం ఎక్కువ ఆధారపడివుండే. ఇవి చెన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్, పంజాబ్ వర్సెస్ హరిందర్ సింగ్ కేసులలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై పంజాబ్ ప్రభుత్వం, ఇతరులు రివ్యూ పిటిషన్లు వేశారు.

తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుండి ఇదే విషయమై సుప్రీంకోర్టులో 22 వేరు వేరు పిటిషన్లు దాఖలు కాగా అన్ని పిటిషన్లను కలిపి సర్వోన్నత న్యాయస్థానం ఏడుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ఫుల్ బెంచ్ ఏర్పాటు చేసి కేసులన్నింటినీ దానికి బదిలీచేసి మూడు రోజుల పాటు విచారణ చేపట్టి అనుకూల వ్యతిరేక వాదనలు విని తీర్పును ఆగస్టు 1న తీర్పు వెలువరించింది. ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా అణచివేతకు గురైనవారు, అన్యాయానికి బలైనవారు తమ హక్కుల కోసం ఉద్యమించి సాధించుకున్న సంఘటనలు, సందర్భాలు మనం చూసినం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం అందుకు చక్కటి సమకాలీన ఉదాహరణ. వర్గీకరణ ఉద్యమ స్వభావాన్ని గమనించి తమకెందుకు తలనొప్పి అని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయినవెంటనే వర్గీకరణ చట్టం చేయాలనీ తెలంగాణ శాసనసభ రెండుసార్లు ఏకగ్రీవ తీర్మానాలు చేసి కేంద్రానికి పంపి తలనొప్పి నుండి తప్పించుకున్నట్లే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. తెలంగాణ కేంద్రంగా జరిగిన వర్గీకరణ ఉద్యమం ప్రకారం వర్గీకరణ మాదిగలకు ఏమేరకు ప్రయోజనం జరుగుతదనేది కొన్ని గణాంకాలను పరిశీలించాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021లో జనాభా లెక్కల సేకరణ జరగాలి కానీ జరగలేదు.

సకల జనసర్వేకు చట్టబద్ధతలేదు. తెలంగాణ మాల, మాదిగల్లో ఎవరు వెనుకబడినవారు, ఎవరు అత్యధిక రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారనే లెక్కలు కొన్ని చూద్దాం. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో ఎస్‌సి జనాభా మొత్తంలో మాదిగలు 59.52% మాలలు, ఇతర ఉపకులాల 40.48%. 2014 నుండి 2016 వరకు తెలంగాణ ప్రభుత్వం ఎస్‌సిలకు అందించిన వివిధర కాల స్కీంలలో లబ్ధి పొందినవారి వివరాలు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వాటి ప్రకారం ఎస్‌సి కార్పొరేషన్ యూనిట్లు మొత్తం 63,656 కాగా, వీటిలో మాదిగలకు 46,561 (73.14%), మాలలకు 17,095 (26. 86%), మూడెకరాల భూమి పంపిణీ పథకంలో మొత్తం 2,634 మందిలో మాదిగలు 75.28% (1,983), మాలలు 24.72% (651) ఉన్నారు.దళితబంధు పథకంలో నియోజక వర్గానికి 100లో 90% మాదిగలే ఉన్నారు. ఇక రాష్ట్రం లో ఆర్‌టిసి, మున్సిపల్, విద్యుత్, వైద్య, విద్యారంగాల్లో రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల్లో కూడా మాదిగలే అధిక వాటా పొందుతున్నారు. ఇక ప్రజాప్రతినిధుల ప్రతినిధ్యంలో సర్పంచ్ ఎస్‌సి రిజర్వుడ్ స్థానాలలో మొత్తం 1,454లో మాదిగలు 70.01% (1,01 8), మాలలు 29. 91% (436), ఎంపిటిసిలు 1210లో మాదిగలు 815 (67.35%), మాలలు 395 (32.65%) గణాంకాలు ఈ విధంగా ఉండగా మాలలే మాదిగల వాటా కొల్లగొడుతున్నారనడం అబద్ధపు విషప్రచారమే, దొంగే అందరి కన్నా ముందుగా దొంగ దొంగ అని అరిచినట్లుంది.

మామిడి నారాయణ, 94410 66032

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News