న్యూఢిల్లీ: పాఠశాల ప్రాంగణాలు మూసివేసి ఆన్లైన్ తరగతులకే పరిమితమవుతున్నందున విద్యార్థుల ఫీజులు తగ్గించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కరోనా మహమ్మారి వల్ల ప్రజలంతా ఇబ్బందుల్లో ఉన్నందున యాజమాన్యాలు సున్నితంగా స్పందించాలని సుప్రీంకోర్టు హితవు పలికింది. ఈ కష్టకాలంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పట్ల సౌహార్థ్ర ధోరణితో వ్యవహరించాలని సూచించింది. పాఠశాలలు మూసి వేసి ఆన్లైన్ తరగతులకు వెళ్లడం వల్ల యాజమాన్యాలకు నిర్వహణ ఖర్చులు తగ్గాయని పేర్కొన్నది. మహమ్మారి సమయంలో పాఠశాలలు విద్యార్థుల ఫీజుల్ని 30 శాతంమేర తగ్గించాలని రాజస్థాన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అక్కడి ప్రైవేట్ యాజమాన్యాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ ఎఎం ఖాన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరితో కూడిన ద్విసభ్య ధర్మాసనం రాజస్థాన్ ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది.