Thursday, October 24, 2024

1నుంచి ‘బడి సందడి’

- Advertisement -
- Advertisement -

Schools reopen in Telangana from sep 01

తెరచుకోనున్న తరగతి గది

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలన్నింటిలో తిరిగి ప్రారంభం కానున్న ప్రత్యక్ష తరగతులు

కెజి నుంచి పిజి దాకా చదువుల సంబురం ముందుగా
అన్ని విద్యాసంస్థల్లో పారిశుద్ధాన్ని తిరిగి మామూలు స్థితికి
తెచ్చే బాధ్యత పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖలకు అప్పగింత
నెలాఖరుకల్లా ఆవరణలను శానిటైజ్ చేయాలని
ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశం నిరంతర మూసివేత వల్ల
విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోంది, వారి భవిష్యత్తుపై
ప్రభావం చూపుతుంది సంబంధించిన వారందరినీ
సంప్రదించి నిర్ణయం తీసుకున్నాం : సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : అంగన్‌వాడీలతో సహా రాష్ట్రంలోని అన్ని రకాల ప్రయివేట్, ప్రభుత్వ విద్యా సంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పున:ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కరోనా నియంత్రణ జాగ్రత్తలను తీసుకుంటూ కెజి నుంచి పిజి వరకు అన్ని రకాల తరగతులను నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలో గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను శుభ్రపరిచి ఈ నెల 30వ తేదీలోగా శానిటైజేషన్ చేయాలని పంచాయితీ రాజ్ , మున్సిపల్ శాఖల మంత్రులు, అధికారులకు సూచించారు.

రాష్ట్రంలోని విద్యాసంస్థల పున ప్రారంభంపై సిఎం కెసిఆర్ అధ్యక్షతన సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా రాష్ట్రంలోని విద్యావ్యవస్థ ఇబ్బందుల్లో పడిందన్నారు. విద్యా సంస్థలు మూతపడడంతో విద్యార్థులు తల్లిదండ్రులు సహా ప్రయివేట్ స్కూల్ టీచర్లు తదితర విద్యా అనుబంధ రంగాల్లో అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని ఆయా ప్రభుత్వాలు విద్యాసంస్థల పున: ప్రారంభానికి తీసుకుంటున్న చర్యలను, అనుసరిస్తున్న వ్యూహాలను కూడా సమావేశంలో క్షున్నంగా చర్చించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా పరిస్థితులపై రాష్ట్ర వైద్యశాఖ అధికారులతో కూడా చర్చించామన్నారు. గతం కంటే రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని సంబంధిత అధికారులు తనకు నివేదికలు అందించారన్నారు. ప్రస్థుతం రాష్ట్రంలో కూడా జన సంచారం మామూలు స్థాయిలోకి వస్తున్నదన్నారు.

ఈ సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, పంచాయతీ రాజ్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, సిఎం ఒఎస్‌డిలు గంగాధర్, ప్రియాంక వర్ఘీస్, టిఎస్ డబ్లూఆర్‌ఇఐఎస్ కార్యదర్శి రొనాల్డ్ రోస్, కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ దేవసేన, కమిషనర్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సయ్యద్ ఉమర్ జలీల్, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేష్ రెడ్డి, టిఎస్‌ఎంఎస్ ఐడిసి ఎండి చంద్రశేఖర్ రెడ్డి ఒఎస్‌డి పంచాయతీ రాజ్ సత్యనారాయణ రెడ్డి, టిఎంఆర్ ఇఐఎస్ కార్యదర్శి షఫీ ఉల్లా తదితరలు పాల్గొన్నారు.

విద్యార్ధుల భవిష్యత్‌పై ప్రభావం చూపే అవకాశం

విద్యాసంస్థలను నిరంతరాయంగా మూసివేయడంతో విద్యార్ధినీ విద్యార్థుల్లో ముఖ్యంగా స్కూలు పిల్లల్లో మానసిక వత్తిడి పెరిగుతున్నదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. అది వారి భవిష్యత్తు పై ప్రభావం చూపే పరిస్థితి ఉన్నదనే అధ్యయనాన్ని వైద్యశాఖ అధికారులు సమావేశం దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కెజి నుంచి పిజి దాకా, ప్రయివేట్ ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని రకాల విద్యను అభ్యసిస్తున్న విద్యార్ధినీ విద్యార్థులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. పలు కోణాల్లో అన్ని రకాల పూర్వాపరాలు పరిశీలించిన మీదట, సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయాలను తీసుకున్నామన్నారు. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకుంటూ అన్ని రకాల విద్యాసంస్థలను వచ్చే నెల 1నుంచి పున: ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సిఎం కెసిఆర్ తెలపారు.

పంచాయితీ రాజ్ మున్సిపల్ శాఖలదే బాధ్యత

ఇన్నాల్లూ పాఠశాలలు మూతబడి ఉండడం మూలాన, గ్రామాలు పట్టణాల్లోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో పారిశుధ్యాన్ని తిరిగి సాధారణ స్థాయికి తెచ్చే బాధ్యతను పంచాయితీ రాజ్, మున్సిపల్ శాఖలు తప్పనిసరిగా తీసుకోవాలని సిఎం స్పష్టం చేశారు. పాఠశాలలు విద్యాసంస్థల ఆవరణలు పరిశుభ్రంగా పెట్టే బాధ్యత ఆయా గ్రామాల్లోని సర్పంచులు, మున్సిపల్ చైర్మన్‌లదేనని ఆయన పునరుద్ఘాటించారు. మరో వారం రోజుల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆగస్టు నెలాఖరుకల్లా ప్రత్యేక శ్రద్ధతో మరుగుదొడ్లతో సహా, విద్యాసంస్థల ఆవరణలను సోడియం క్లోరైడ్, బ్లీచింగ్ పౌడర్ వంటి రసాయనాలతో పరిశుభ్రంగా తయారు చేయాలన్నారు. విద్యాసంస్థల పరిధిల్లోని నీటి ట్యాంకులను తేటగా కడిగించాలన్నారు. తరగతి గదులను కడిగించి శానిటైజేషన్ చేయించాలని సర్పంచులు మున్సిపల్ చైర్మన్లను సిఎం ఆదేశించారు.

ఇందుకుగాను జిల్లా పరిషత్ చైర్మన్లు వారి వారి జిల్లాల్లో, మండలాధ్యక్షులు వారి వారి మండలాల్లో పర్యటించి అన్ని పాఠశాలలు సానిటైజేషన్ చేసి పరిశుభ్రంగా వున్నయో లేవో పరిశీలించాలన్నారు. ఈ విషయాన్ని జిల్లాల డిపిఒలు, జెడ్‌పి సిఇఒలు, ఎంపిఒలు, ఎంపిడిఒలు, డిపిఒలు, ఎప్పటికప్పుడు పరిశీలించి నిర్దారించాల్సిన బాధ్యతతీసుకోవాలన్నారు. ఈ నెల 30 తేదీలోపల ఎట్టి పరిస్థితుల్లో అన్నిరకాల ప్రభుత్వ విద్యాసంస్థల శానిటైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.

విద్యార్థుల పట్ల జాగ్రత్తలు

విద్యాసంస్థలు తెరిచిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లల్లోని విద్యార్థినీ విద్యార్థులకు జ్వర సూచన ఉంటే ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్ వెంటనే అతి సమీపంలోని పిహెచ్‌సికి తీసుకువెళ్లి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని సిఎం తెలిపారు. ఒకవేళ కోవిడ్ నిర్దారణ అయితే సదరు విద్యార్థినీ విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు. హాజరయ్యే విద్యార్థినీ విద్యార్థులు శానిటైజేషన్ చేసుకోవడం, మాస్కులను విధిగా ధరించడం వంటి కోవిడ్ నియంత్రణ చర్యలను విధిగా పాటించాలన్నారు. ప్రతి రోజు తమ పిల్లలకు మాస్కులు ధరించేలా, తదితర కోవిడ్ నియంత్రణ విధానాలను పాటించేలా చూసుకోవాలని, తమ పిల్లలను విద్యాసంస్థలకు పంపుతున్న తల్లిదండ్రులను సిఎం కెసిఆర్ కోరారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News