రావల్పిండి: ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ ఈసారి పాకిస్థాన్లో జరుగుతున్న విషయం తెలిసిందే. తమ దేశంలో ఎటువంటి ప్రమాదాలు జరగవని ఐసిసిని, ఇతర దేశాలను ఒప్పించి తమ దేశంలో ఈ టోర్నమెంట్ను పాకిస్థాన్ పెట్టించుకుంది. దీంతో దాదాపు 29 సంవత్సరాల తర్వాత పాకిస్థాన్లో ఓ ఐసిసి టోర్నమెంట్ జరుగుతుంది. అయితే భారత్ మినహా మిగితా దేశాలన్ని పాకిస్థాన్లోనే మ్యాచ్లు ఆడుతున్నాయి. భారత్ మాత్రం దుబాయ్లో తమ మ్యాచ్లు ఆడుతోంది.
అయితే పాకిస్థాన్లో ఎంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేసిన ఏక్కడో ఒక దగ్గర వైఫల్యాలు కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ ట్రోఫీ చూసేందుకు వచ్చే విదేశీయులను కిడ్నాప్ చేసే యోచనలో ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక ఇచ్చింది. దీంతో మరింత పటిష్టంగా భద్రత ఏర్పాటు చేసినా.. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య రావల్పిండి వేదికగా జరిగిన ఓ సంఘటన అన్ని జట్లను కలవర పెడుతోంది.
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియం సెక్యూరిటీని దాటుకొని వచ్చిన ఓ యువకుడు.. చేతిలో తరీఖ్-ఏ-లబ్బైక్ నేత సాద్ రిజ్వి ఫోటో పట్టుకొని బ్యాట్స్మెన్ రచిన్ రవీంద్ర వైపు పరుగు తీశాడు. దీంతో ఒక్కసారిగా అంతా భయాందోళనకు గురయ్యారు. అతను రవీంద్ర వద్దకు వచ్చి అతని కౌగిలించుకున్నాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న భద్రత సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు.