జమ్మూ : జమ్మూలోని వైష్ణోదేవి ఆలయంలో భద్రత వైఫల్యం వెలుగు చూసింది. ఒక మహిళ తనిఖీలు నిర్వహించే సిబ్బంది కళ్లుగప్పి తుపాకితో ఆలయంలోకి ప్రవేశించింది. ఈ నెల 15న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక మహిళ వద్ద ఆయుధాన్ని గుర్తించిన అధికారులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వద్ద నుంచి తుపాకిని వారు స్వాధీనం చేసుకున్నారు. సదరు మహిళను ఢిల్లీ పిఎస్లో పని చేస్తున్న జ్యోతి గుప్తాగా పోలీసులు గుర్తించారు. గడువు ముగిసిన లైసెన్స్డ్ తుపాకిని ఆమె ఆలయంలోకి తీసుకువచ్చినట్లు, ఆమెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలియజేశారు. ఈ ఘటన ఆలయానికి వచ్చే భక్తులను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసింది. ఆయుధంతో ఆమె ఆలయంలోకి ప్రవేశించే వరకు భద్రత సిబ్బంది ఎవరూ దానిని గుర్తించకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వారు కోరుతున్నారు.