పార్టీ క్రమశిక్షణా బేఖాతర్
మొన్న దానం, అంజన్కుమార్, నిన్న మల్రెడ్డి, నేడు విహెచ్
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డే గీతదాటరనే విమర్శ
కాంగ్రెస్ కల్చర్ పునరావృతం అవుతుందని ఇంటా బయటా విమర్శ
అధిష్ఠానం సీరియస్గా తీసుకొనే మీనాక్షిని నియమించినట్టు సమాచారం
మన తెలంగాణ/హైదరాబాద్: అధికార కాంగ్రెస్ పార్టీ కట్టుబాట్లకు ఆ పార్టీ సీనియర్ నాయకులే తూట్లు పొడిచేలా వ్యవహరిస్తున్నారు. హద్దుమీరుతున్న ఈ నాయకుల తీరు పట్ల అధిష్ఠానాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. వీరి వైఖరి వల్ల కాంగ్రెస్ పార్టీ కల్చర్ ఇంతేనని ప్రజలలో బలంగా నాటుకున్న అభిప్రాయానికి ఊతం ఇచ్చినట్టు అవుతుందన్నది ఈ ఆందోళనకు కారణమని పార్టీ వర్గాల సమాచారం. పార్టీ గీత దాటుతున్న వారిని కట్టడి చేయడంలో భాగంగానే రాష్ట్ర పార్టీ ఇంచార్జీగా మీనాక్షి నటరాజన్ను నియమించినట్టు చెబుతున్నారు. తన తొలి సమావేశంలోనే పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని మీనాక్షి నటరాజన్ హెచ్చరించడం ఈ వాదనకు బలం చేకూర్చుతోంది. పార్టీ నేతలను కట్టడి చేయడంలో పూర్వ ఇంచార్జీ దీపాదాసు మున్షీ విఫలం అయిందని అధిష్ఠానం భావించడం వల్లనే కొత్త ఇంచార్జీని నియమించినట్టు పార్టీ వర్గాల సమాచారం.
పదవుల కోసమే కులాలను రెచ్చగొడుతున్నారా?
మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఆశించే కొందరు సీనియర్లు పార్టీ పెద్దలను బ్లాక్మెయిల్ చేయడానికి వెనుకాడటం లేదని పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఈ పదవులకు తోడుగా తాజాగా ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవుల భర్తీ కూడా తోడైందని చెబుతున్నారు. పార్టీలో పదవులను పొందాలనుకునే నాయకులు నయానో భయానో పార్టీ పెద్దలను బెదిరించడానికి కుల రాజకీయాలకు తెర లేపారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మంత్రివర్గంలో ఎలాగైనా స్థానం సంపాదించే వ్యూహంతో మొదట పార్టీ వైఖరితో సంబంధం లేకుండా సీనియర్ నాయకుడు వివేక్ వెంకటస్వామి పెద్ద ఎత్తునా మాలల సభ నిర్వహించినట్టు ఆరోపణలు వచ్చాయి. ఎస్సీ వర్గీకరణపై పార్టీ వైఖరిని ప్రశ్నించే విధంగా వివేక్ వెంకటస్వామి తన సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టారన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తం అయింది.
మంత్రివర్గ విస్తరణలో స్థానం సంపాదించడానికే ఈ సభ పెట్టారన్న ఫిర్యాదులు అధిష్ఠానానికి అందిన నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిందని పార్టీ వర్గాల సమాచారం. ఇలా ఉండగా ఇటీవల మాజీ ఎంపి అంజన్కుమార్ యాదవ్ కూడా తన సామాజికవర్గం నేతలతో సమావేశం నిర్వహించి పార్టీ ముఖ్యులపై తీవ్ర ఆరోపణలు చేసారు. దానం నాగేందర్కు కాకుండా తనకు టికెట్ ఇచ్చి ఉంటే గెలిచేవాడనని అంజన్కుమార్ యాదవ్ వ్యాఖ్యనించడం అధిష్టాన నిర్ణయాన్ని ప్రశ్నించడమే అంటున్నారు. ఎంపి టికెట్ నిర్ణయం అనేది అధిష్ఠానం తీసుకున్న నిర్ణయమే తప్ప అది రాష్ట్ర నాయకుల నిర్ణయమన్న విషయం కాదన్నది అంజన్కుమార్ యాదవ్ వంటి సీనియర్ నాయకుడికి తెలియదు అనుకోలేమని పార్టీ నేతలు అంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీని దక్కించుకోవడానికే తన సామాజికవర్గం నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పెద్దలను పరోక్షంగా దారికి తెచ్చుకునే వ్యూహంతోనే అంజన్కుమార్ యాదవ్ ఈ సమావేశం ఏర్పాటు చేసి ఉంటారని రాజకీయ పరిశీలకులు కూడా అంచనా వేస్తున్నారు.
అంజన్కుమార్ యాదవ్ బాటలోనే మరో సీనియర్ నాయకుడు వి హనుమంతరావు తన సామాజిక వర్గం నేతలతో సమావేశం ఏర్పాటు చేసి పదవులలో తమ సామాజికవర్గం నేతలకు అన్యాయం జరిగిందనే వాదన గట్టిగా వినిపించారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి కోసమే విహెచ్ ఈ సమావేశం ఏర్పాటు చేసినట్టు అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. సొంత పార్టీ నేతలతో కాకుండా ప్రతిపక్ష పార్టీలలో ఉన్న తమ సామాజిక వర్గం నేతలను కూడా ఈ సమావేశానికి విహెచ్ ఆహ్వానించడమే కాకుండా మున్నూరు కాపులకు కాంగ్రెస్ హయాంలో అన్యాయం జరుగుతుందనే విమర్శలు చేయించడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్గా తీసుకున్నట్టు చెబుతున్నారు.
ఈ అంశంలో విహెచ్ నుంచి సంజాయిషీ కోరుతూ అధిష్టానం తాఖీదులు జారీ చేయబోతున్నట్టు తాజా సమాచారం. ఇది ఇలా ఉంటే మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం కల్పించకపోతే రాజీనామా చేయనున్నట్టు మరో సీనియర్ నాయకుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పరోక్షంగా అధిష్టానానికి సంకేతాలు పంపించారు. మల్రెడ్డి వర్గీయులు అయితే కాబోయే మంత్రి మల్రెడ్డి రంగారెడ్డి అనే ఫ్లెక్షీలు ఏర్పాటు చేసిన విషయం అధిష్టానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. మూసీనది ప్రక్షాళనలో భాగంగా సీఎం రేవంత్రెడ్డి హైడ్రా ఏర్పాటు చేయగా, దానిని ప్రతిపక్ష నాయకుల కంటే ముందుగానే ‘హైడ్రా..గిడ్రా జాన్తా నహీ’ అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ తప్పు పట్టారు. తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు పలుమార్లు చెబుతున్నా ఆయన నుంచి పార్టీ వివరణ కోరలేకపోయింది. ఇదే అదునుగా మూసీ పరివాహకంలో ఇళ్లు కోల్పోయేవారికి తానే అండగా నిలిచి కోర్టులో వారి తరఫున పోరాడుతానని మరో సీనియర్ నాయకుడు మధుయాష్కీ ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించిన విషయం తెలిసిందే.
క్రమశిక్షణా కమిటీ చైర్మనే గీత దాటారా?
టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్గా ఉన్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జి. చిన్నారెడ్డి, పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారన్న కారణంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లనపై సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ చర్య తీసుకోవడానికి సరిగ్గా రెండు రోజుల ముందు వనపర్తిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ క్రమశిక్షణా రాహిత్యం కాదా? అని పార్టీలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికలలో ప్రస్తుత వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పార్టీలో కొందరు నాయకులకు డబ్బులు ఇచ్చి టికెట్ తెచ్చుకున్నారని చిన్నారెడ్డి స్వయంగా ఆరోపించారు. పైగా మహబూబ్నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి రూ. 90 కోట్లు తీసుకొని పార్టీని మోసం చేసారని కూడా చిన్నారెడ్డి తీవ్ర ఆరోపణలు చేసారు. పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ పదవిలో ఉన్న నాయకుడే ఈ విధంగా క్రమశిక్షణ తప్పి మాట్లాడటం ఎంత వరకు సమంజసమని పార్టీలో హాట్టాపిక్గా మారింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీ సీనియర్ నాయకులే ప్రభుత్వానికి, పార్టీకి తలనొప్పిగా మారడాన్ని అధిష్ఠానం సీరియస్గా తీసుకుందని పార్టీ వవర్గాల సమాచారం.
కొత్త ఇంచార్జీ దారికి తెచ్చేనా?
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది నిండకముందు నుంచే కొందరు సీనియర్ నాయకులు క్రమశిక్షణా రాహిత్యానికి శ్రీకారం చూట్టారు. దీంతో తల్లి చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? నన్న చందంగా ఒకరి తర్వాత ఒకరు పార్టీ క్రమశిక్షణా గీత దాటడం మొదలు పెట్టడంతో అది రోజు రోజుకు పరాకాష్టకు చేరుకునే స్థాయికి చేరుకుందని అంటున్నారు. ఇక నుంచి ఈ వ్యవహారానికి ఫుల్స్టాప్ పెట్టడంలో భాగంగానే మీనాక్షి నటరాజన్ను అధిష్ఠానం నియమించిందని చెబుతున్నారు.
పార్టీ గీతదాటుతున్న నాయకులను పార్టీ రాష్ట్ర కొత్త ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ ఏవిధంగా దారికి తెస్తుందో చూడాలని పార్టీ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి.