Thursday, September 19, 2024

కొంతకాలం భారత్‌లోనే హసీనా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కొన్ని అస్థిర పరిస్థితుల కారణంగా బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రయాణ కార్యక్రమానికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఆమె మరి కొన్ని రోజులు భారత్‌లోనే ఉండే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు మంగళవారం తెలిపాయి. బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి పదవికి సోమవారం రాజీనామా చేసిన హసీనా కొద్ది గంటలకే ఘజియాబాద్ సమీపంలోని హిండన్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెను గుర్తు తెలియని ప్రదేశానికి తరలించి పటిష్టమైన భద్రతను కల్పించినట్లు వర్గాలు తెలిపాయి. ఆమె భారత్ నుంచి లండన్‌కు ప్రయాణించాల్సి ఉండగా చట్టపరమైన రక్షణ ఏదీ కల్పించలేమని బ్రిటన్ ప్రభుత్వం సూ చించడంతో ఆమె ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్ మీదుగా లండన్ వెళ్లాలన్నది హసీనా ఆలోచన. ఇదే విషయాన్ని ఆ మె సహాయకులు హిండన్ విమానాశ్రయాన్ని చేరుకోవడానికి ముందు భారత ప్రభుత్వానికి తెలియచేశారు. 76 సంవత్సరాల హసీనా తన సోదరి షేక్ రెహానాతో కలసి తన అధికారిక నివాసం నుం చి సై నిక హెలికాప్టర్‌లో ఎయిర్‌బేస్‌కు,చేరుకన్నారు. అక్కడి నుంచి బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెం దిన సి 130 సైనిక రవాణా విమానంలో హిం డన్ విమానాశ్రయాన్ని చేరుకున్నటు తెలిపాయి.

యుఎన్ దర్యాప్తునకు బ్రిటన్ డిమాండ్
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీసిన హింసాత్మక నిరసనలపై ఐక్యారాజ్య సమితి నేతృత్వంలో దర్యాప్తు జరగాలని బ్రిటన్ ప్రభుత్వం మంగళవారం పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్‌కు శాంతియుత, ప్రజాస్వామిక భవిష్యత్తును తాము కోరుకుంటున్నామని బ్రిటన్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ లామీ లండన్‌లో తెలిపారు. అయితే షేక్ హసీనా కోరుకుంటున్న ఆశ్రయాన్ని కల్పించడంపై మాత్రం ఆయన ఎటువంటి ప్రస్తావన చేయలేదు. గత కొద్ది వారాలుగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై యుఎన్ నేతృత్వంలో సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. గత రెండు వారాలలో బంగ్లాదేశ్ ఊహించని హింసాకాండను చవిచూసిందని, వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో శాంతి పునరుద్ధరణ కోసం అన్ని పక్షాలు కలసి పనిచేయాలని ఆయన ప్రకటనలో కోరారు.

ఢాకాకు విమాన సర్వీసులు రద్దు
బంగ్లాదేశ్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా మంగళవారం ఉదయం ఢా కాకు వెళ్లే విమాన సర్వీసును రద్దు చేసింది. ఉద్యోగాలలో కోటాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ప్ర జల నుంచి కనీవినీ ఎరుగని రీతిలో తీవ్ర స్థాయిలో నిరసనలు పెల్లుబుకిన దరిమిలా ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవడంతో ఆ దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ దేశానికి విమాన సర్వీసులను అనేక ఎయిర్‌లైన్ సంస్థలు రద్దు చేశాయి. ఇండిగో, ఎయిర్ విస్తారా కూడా మంగళవారం ఢాకాకు తమ సర్వీసులను నిలిపివేసినట్లు ఆ రెండు సంస్థల అధికారులు తెలిపారు. ముంబై నుంచి ఢాకాకు ప్రతిరోజు, ఢిల్లీ నుంచి వారానికి మూడు విమాన సర్వీసులను విస్తారా ఎయిర్‌లైన్స్ నడుపుతోంది. మంగళవారం ఉదయం ఢాకాకు తమ విమాన సర్వీసను రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా అధికారి ఒకరు తెలిపారు. ప్రతి రోజు సాయంత్రం కూడా ఒక విమాన సర్వీసను ఢాకాకు ఎయిర్ ఇండియా నడుపుతోంది. బంగ్లాదేశ్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, పరిస్థితిని బట్టి విమాన సర్వీసులను నడిపే విషయమై నిర్ణయం తీసుకుంటామని అధికారి తెలిపారు.

బంగ్లాదేశ్‌లో హిందు ఆలయాలు ధ్వంసం
ఢాకా : బంగ్లాదేశ్‌లో ప్రధాని షేఖ్ హసీనా ఉద్వాసన దరిమిలా సాగుతున్న హింసాత్మక సంఘటనల్లో పలు హిందు ఆలయాల, ఇళ్లు, వాణిజ్య సంస్థలను ధ్వంసం చేశారని, మహిళలపై దౌర్జనం జరిగిందని, అవామీ లీగ్‌తో అనుబంధం ఉన్న కనీసం ఇద్దరు హిందు నేతలను హత్య చేశారని హిందు సమాజం నేతలు మంగళవారం తెలియజేశారు. ‘దేశంలోని వివిధ ప్రాంతాల్లో విధ్వంసం ఘటనల సమాచారం కొన్నిటిని సంకలనం చేశాం. అవి హిందువులు, ఇతర మైనారిటీ సమాజాలను ఆందోళనపరుస్తున్నాయి’ అని బంగ్లాదేశ్ హిందు బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్ నేత కాజోల్ దేబ్‌నాథ్ ఢాకాలో ఆ గ్రూప్ సమావేశం తరువాత ‘పిటిఐ’తో చెప్పారు.అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, హసీనా అవామీ లీగ్ (ఎఎల్)కు చెందిన ఇద్దరు హిందు నేతలను వాయవ్య సిరాజ్‌గంజ్, రంగ్‌పూర్‌లలో హత్య చేశారని దేబ్‌నాథ్ తెలిపారు.

కౌన్సిల్ మరింత సమాచారాన్ని సేకరిస్తున్నదని దేబ్‌నాథ్ చెప్పారు. హసీనా ప్రభుత్వ పతనం తరువాత వేగంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దుండగులు ‘షాపులు, ఆలయాలు, ఇళ్లు ధ్వంసం చేశారు, హిందు మహిళలపై దౌర్జన్యం చేశారు, అనేక మంది దౌర్జన్య సంఘటనలలో గాయపడ్డారు’ అని దేబ్‌నాథ్ వివరించారు. ‘పరిస్థితి బీభత్సంగా ఉంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతున్నాయి’ అని యూనిటీ కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి రాణా దాస్‌గుప్తా అంతకుముందు ఒక ప్రకటనలో తెలియజేశారు. ‘మైనారిటీలకు భద్రత లభించేలా చూడాలని, దాడి బాధ్యులను వెంటనే నిర్బంధించాలని సైన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం’ అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News