Thursday, October 24, 2024

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్

- Advertisement -
- Advertisement -

దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు బోనస్‌ను శుక్రవారమే చెల్లిస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. దీని కోసం సింగరేణి సంస్థ రూ.358 కోట్లను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్‌ను ఆదేశించారు. గురువారం హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో సింగరేణిపై జరిగిన సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది చెల్లించిన దీపావళి బోనస్ కన్నా ఇది రూ.50 కోట్లు అధికం కావడం విశేషం. శుక్రవారం మధ్యాహ్నం సమయానికి దీపావళి బోనస్‌ను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. దీపావళి బోనస్ కింద ఒక్కొక్క కార్మికుడు రూ.93,750లు అందుకోనున్నారు.

సంస్థలో పనిచేస్తున్న దాదాపు 40,000 మంది కార్మికులకు ఈ బోనస్ అందనుంది. బొగ్గు పరిశ్రమ కోసం జేబీసీసీఐ విధానాల్లో భాగంగా కంపెనీలు సాధించిన ఉత్పత్తి పరిమాణం ఆధారంగా కార్మికుల శ్రమకు ప్రోత్సాహకంగా ఈ బోనస్‌ను చెల్లించే పద్ధతి గత కొన్నేళ్లుగా అమలులో ఉంది.ఈ ఏడాది కూడా కోల్ ఇండియా స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా దీపావళి పండుగకు ముందే చెల్లింపులు జరిగేలా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలిచ్చారు. ఇటీవలే సింగరేణి ఉద్యోగులందరికీ 33 శాతం లాభాల వాటా కింద రూ.796 కోట్లను కంపెనీ పంపిణీ చేసిందని సింగరేణి సీఎండీ బలరాం తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News